వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 31వ తేదీన 5వ నేషనల్ జావెలిన్్ త్రో డే వేడుకలు నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అండర్–6 నుంచి అండర్–20 విభాగాల్లో మెన్ అండ్ ఉమెన్లో జావెలిన్ త్రో ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీలో పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా జనన ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని, ఇందులో ఎంపికై నవారు ఆగస్టు 7న హనుమకొండ జేఎన్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు, ఇతర వివరాలకు 93901 04499, 99120 22188 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.
ట్రిప్లింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి
● రైళ్ల ట్రాఫిక్ క్లియర్
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని దక్షిణ మధ్య రైల్వే గ్రాండ్ ట్రంక్ మార్గంలో కాజీపేట–బల్లార్షా ట్రిప్లింగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయినట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య 11 కిలో మీటర్లు మేర చివరి దశ పనులు విద్యుద్దీకరణతో సహా పూర్తయినట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే సుమారు రూ.3,000 కోట్ల వ్యయంతో దశల వారీగా కాజీపేట–బల్లార్షా మధ్య 203 కిలోమీటర్ల మేర ట్రిప్లింగ్, విద్యుద్దీకరణ పనులు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. దీంతో గ్రాండ్ ట్రంక్మార్గంలో ప్రయాణించే రైళ్లు, సరుకు రవాణా రైళ్ల రాకపోలకు అంతరాయం ఉండదన్నారు. కాజీపేట–బల్లార్షా మార్గం దేశంలోనే ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే ఒక కీలక రైలు మార్గంగా నిలుస్తోందని అధికారులు తెలిపారు.


