సందర్శించిన శ్రీలంక బృందం
భీమదేవరపల్లి : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంకు, మార్కెటింగ్ సొసైటీని గురువారం శ్రీలంక ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో భాగంగా శ్రీలంకకు చెందిన 32 మంది ప్రజాప్రతినిధులు జూలై 20 నుంచి 29 వరకు భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ బృందం ముల్కనూరు సొసైటీని సందర్శించి పరిశీలించింది. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి శ్రీలంక ప్రతినిధులకు సొసైటీ చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల ఆర్థిక బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రతినిధుల సందర్శన కోసం ముల్కనూరు కోఆపరేటివ్ సొసైటీని ఎంపిక చేయడం గర్వకారణమన్నారు. ముల్కనూరు మోడల్ ఇక్కడి సభ్య రైతుల జీవితాల్లో తెచ్చిన గణనీయమైన మార్పులకు ఈ సందర్శన నిదర్శనమన్నారు. శ్రీలంక ప్రతినిధులు తమ ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు ఈ మోడల్ విధానాలను అమలు చేసి రైతులకు మేలు చేకూర్చాలని సూచించారు. ఈ పర్యటనలో ముల్కనూరు సొసైటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


