వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–26 ఏర్పాట్లలో భాగంగా హనుమకొండలో ప్రతిపాదిత ఖోఖో, జూడో క్రీడా వేదికలను ఖేలో ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర జ్యోతి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్లు బుధవారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ ఖేలో ఇండియా బృందం పర్యటనకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాలు, పోటీల నిర్వహణకు అవసరమైన సాంకేతిక అంశాలు, ఆటగాళ్ల వసతి, రవాణా, ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని హనుమకొండ యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్కు సూచించారు. ఈసందర్భంగా హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్, సంబంధిత క్రీడా అధికారులు, సిబ్బంది పాల్గొని హనుమకొండలోనీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని ఖోఖో, జూడో పోటీల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లకు వివరించారు. ఖేలో ఇండియా యూత్ క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అన్ని జిల్లాలతో సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోందని అధికారులు తెలిపారు.
జేఎన్ఎస్లో ఖోఖో, జూడో వేదికలు పరిశీలించిన క్రీడాధికారులు


