సీబీఎం నిల్వల అభివృద్ధికి
హన్మకొండ చౌరస్తా : తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు క్షేత్రాలు, ములుగు–భూపాలపల్లి ప్రాంతాల్లో ఉన్న కోల్ బెడ్ మిథేన్ (సీబీఎం) నిల్వల అన్వేషణ, అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య బుధవారం లోక్సభలో కోరారు. సీబీఎం వనరుల శాసీ్త్రయ అన్వేషణ, వాణిజ్యపరమైన వినియోగం ద్వారా తెలంగాణలోని బొగ్గు గని ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. అయితే గణనీయ నిల్వలు ఉన్నా వాటి అన్వేషణ, అభివృద్ధి ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీఎం వెలికితీత, వినియోగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ అభివృద్ధి ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, జాతీయ ఆహార భద్రత చట్టం అమలుపై కూడా ప్రశ్నించారు. జిల్లాలో ఎంత మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారో, అలాగే ఆహార ధాన్యాల కేటాయింపు, ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై వివరాలు కోరారు. ఆహార ధాన్యాల కేటాయింపులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, భవిష్యత్లో లబ్ధిదారుల సంఖ్య పెరిగితే తగిన విధంగా కేటాయింపులు పెంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య


