హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం అమ్మవారికి కపాలినీ, భగమాలినీ క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు ఉ దయం నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్ననివేదన, చతుఃస్థానార్చన తదితర పూజలు నిర్వహించారు. దశమహావిద్యల్లోని కాళీక్రమాన్ని అనుసరించి అమ్మవారి స్నపన మూర్తిని కపాలినీగా, షోఢశీ క్రమాన్ని అనుసరించి అమ్మవారి బోగభేరాన్ని భగమాలినీగా అలంకరించి నవరాత్ర విశేష పూజలు జరిపారు. ఆలయ ఈఓ రామల సునీత, సిబ్బంది పర్యవేక్షించారు.
కేయూ క్యాంపస్: తెలంగాణలోని తొమ్మిది యూనివర్సిటీల్లో 2026–27 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను టీజీసీపీగెట్–26 ఈనెల 8 నుంచి ప్రారంభమై గురువారం ముగిసింది. 39 పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షలు ముగిసినట్లు సీపీ గెట్ కన్వీనర్ కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. ప్రతీరోజు మూడు సెషన్లలో పలు కోర్సులకు రాష్ట్రంలో 22 పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 52,697 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 45,462 మంది పరీక్షలు రాసినట్లు పేర్కొన్నారు. 82.27 శాతం మంది హాజరైనట్లు తెలిపారు. చివరిరోజు గురువారం ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు మొదటి సెషన్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈకోర్సుకు 1,387 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. అందులో 1,237 మంది ప్రవేశ పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఈనెలాఖరుకల్లా టీజీసీపీగెట్ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల చేయాలనే యోచనలో సంబంధిత అధికారులున్నారు.
వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. ఈమేరకు అధ్యక్షుడిగా చిలుకమారి రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా కందుకూరి ఇమ్మానుయేల్, అసోసియేట్ అద్యక్షుడు ఈ.పి శ్రీధర్బాబు, ఉపాధ్యక్షులుగా జి.రమేశ్కుమార్, ఎస్.శ్రీనివాస్, డి.సంధ్యారాణి, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా దయాకర్, కోశాధికారిగా కార్తీక్, జాయింట్ సెక్రెటరీలుగా వి.సంతోశ్బాబు, రమేశ్, లక్ష్మీనారాయణ, ప్రమోద్కుమార్ ఎన్నికయ్యారు.
న్యూశాయంపేట: తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నియంత్రణ, విద్య, వాతావరణ పరిస్థితులు, ప్రజాపాలన తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు గురువారం సాయంత్రం హైదరాబాద్ సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


