ఎస్ఎస్తాడ్వాయి: వచ్చే మేడారం మహా జాతరకు హాజరయ్యే కోట్లాది మంది భక్తులకు ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా అన్ని అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు గురువారం మేడారంలో హరితహోటల్లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి జిల్లా అధి కారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతర సమయంలో ట్రాఫిక్ సమస్య లేకుండా మేడారం–తా డ్వాయి, పస్రా–మేడారం, చిన్నబోయినపల్లి–కొండాయి–ఊరట్టం రహదారుల విస్తరణకు వెంటనే అంచనాలు సిద్ధం చేసి అవసరమైన అనుమతులు పొందాలని ఆదేశించారు. క్యూలైన్ల ఆధునికీకరణ తోపాటు ఆలయ పరిసరాల్లో డ్రెయినేజీ పనులను వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. జంపన్న వాగు పరిసరాలను సుందరీకరించి, వాగుపై చెక్డ్యామ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూ చించారు. ఈ అంశంపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. భక్తుల కోసం కాటేజీలు, విశ్రాంతి కేంద్రాల ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రవాణా, వైద్య సేవలు, భద్రత వంటి అన్ని మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ మేడారం అభివృద్ధి పనులను గడువులోగా నాణ్యతాప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎఫ్ఓ వికాస్ మీనా, అదనపు కలెక్టర్లు సి.హెచ్ మహేందర్ జీ, సంపత్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ కృష్ణవేణి, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ
మంత్రి సీతక్క
మేడారంలో అధికారులతో సమీక్ష


