● వరంగల్ ఇన్చార్జ్
డీఎంహెచ్ఓ ప్రకాశ్
కాశిబుగ్గ/ఖిలా వరంగల్: చిన్న కుటుంబంతోనే సంతోషకరమైన జీవనం కొనసాగించవచ్చని వరంగల్ ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా వరంగల్లోని ఉర్సు, సీకేఎం ఆస్పత్రుల్లో గురువారం పురుషుల కుటుంబ నియంత్రణ శాశ్వత శస్త్రచికిత్స శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ పద్ధతులను ప్రజలు స్వచ్ఛందంగా పాటించాలని, మాతాశిశు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్వీ అనేది సురక్షితమైన, సులభమైన, ప్రతిభావంతమైన శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతి అని పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం పురుషులు సాధారణ జీవనం కొనసాగించవచ్చన్నారు. ప్రత్యేక శిబిరంలో 21 మంది పురుషులకు ఎన్ఎస్వీ శస్త్రచికిత్సలను డిప్యూటీ సివిల్ సర్జన్ కృష్ణారావు నిర్వహించినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాజిదాబేగం, వైద్యాధికారి ఎం.శ్రవణ్కుమార్, డాక్టర్ ప్రతీక్, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, ఫ్యామిలీ వెల్ఫేర్ వర్కర్ మసూద్ అలీ, నర్సింగ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.


