ఖిలా వరంగల్ : ఓరుగల్లు, ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెరవేర్చారని, విమర్శలు పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, టి.రాజేశ్వర్రావు, కొండేటి శ్రీధర్ అన్నారు. వరంగల్ మామునూరు విమానాశ్రయం అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ బుధవారం విమానాశ్రయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా ఎదురుచూసిన ఎన్నో కీలక అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే వెనుక పడ్డాయని విమర్శించారు. 2014 నుంచి ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. దేశంలోనే 163 విమానాశ్రయాల అభివృద్ధి విషయంలో 2014లోనే కేంద్రం పార్లమెంట్లో నిర్ణయం తీసుకుందని, అందులో 16వ స్థానంలో మామునూరు ఎయిర్ పోర్టు ఉండడం విశేషమని తెలిపారు. ఎయిర్పోర్టు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.853 కోట్లు కేటాయించిందని, మూడు వారాల్లో పనులు ప్రారంభమవుతాయన్నారు. రూ. 520 కోట్ల వ్యయంతో 160 ఎకరాల విస్తీర్ణంలో కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు తుదిదశకు చేరుకున్నాయని, పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ను రూ.500కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రతినిధి వన్నాల వెంకటరమణ, నేతలు రావు పద్మ, రత్నం సతీశ్, మల్లాడి తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్, జలగం రంజిత్, దేవేందర్రెడ్డి, మల్లాడి రాంరెడ్డి, సాంబార్ కిశోర్, నీరటి సుదర్శన్రెడ్డి, నల్లతీగల శ్రీనివాస్, ఆకటుకుల రమణ, సతీశ్, శివ పాల్గొన్నారు.
సమన్వయంతో పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి
మాజీ ఎంపీ సీతారాంనాయక్,
మాజీ ఎమ్మెల్యే ధర్మారావు


