హన్మకొండ కల్చరల్: ధూపదీపనైవేద్య అర్చకుల సమస్యలు పరిష్కరిస్తామని, వారి జీవనవిధానం మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం హనుమకొండ వేయిస్తంభాల దేవాలయం ఆవరణలో ధూపదీపనైవేద్య పథకం రాష్ట్ర శాఖ, తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాగా, డీడీఎన్ అర్చకులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెరంబదూర్ శ్రీకాంత్చారి, రాష్ట్ర కన్వీనర్ మహేంద్రాచారి, మాజీ అర్చక వెల్ఫేర్ బోర్డు మెంబర్ జక్కాపురం నారాయణచారి, అన్నావజ్జుల ప్రసాద్శర్మ, ఏటూరి ఆంజనేయచారి, మాజీ కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, సీతారాంశర్మ తదితరులు పాల్గొని తీర్మానాలు ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 6,600 మంది డీడీఎన్ అర్చకులకు ఉద్యోగభద్రత కల్పించాలని, పీఆర్సీ 99 వర్తింపజేయాలని, ఆరోగ్యబీమా, తదితర అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో 200మందికి పైగా అర్చకులు పాల్గొన్నారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
నాయిని రాజేందర్రెడ్డి


