కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్ మీదుగా నడిపిస్తున్న చర్లపల్లి–దానాపూర్ నాలుగు ఎక్స్ప్రెస్ రైళ్లను మరికొన్ని రోజుల పాటు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
ఈ నెల 18, 25వ తేదీల్లో చర్లపల్లి–దానాపూర్ (07091) ఎక్స్ప్రెస్ చర్లపల్లిలో 13:00 గంటలకు బయలుదేరి కాజీపేటకు 15:00 గంటలకు చేరుతుంది. ఈ నెల 20, 27వ తేదీల్లో ప్రయాణించే దానాపూర్–చర్లపల్లి (07092) ఎక్స్ప్రెస్ దానాపూర్లో సోమవారం 03:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు కాజీపేటకు 08:00 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సె కండ్క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీ స్లను కాజీపేట, రామగుండం, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్షా, చందాపోర్టు, గోండియా, బాలఘట్, నైన్పూర్, జబల్పూర్, కఠ్నీ, సంత, మాణిక్పూర్, ప్రయాగ్రాజ్, చౌఖీ, పండిట్ ధీన్దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, బాక్సర్, ఆరా స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు.
హత్య కేసులో జీవిత ఖైదు
ఖమ్మం లీగల్: హత్య కేసులో హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామానికి చెందిన రాపోలు వెంకటేశ్వర్లు అలియాస్ రాజుకు జీవిత ఖైదు విధిస్తూ ఖమ్మం నాలుగో అదనపు సెషన్స్ జడ్జి డాక్టర్ జీవీ మహేశ్నాథ్ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఖమ్మంలోని ప్రకాశ్నగర్కు చెందిన దుగ్యాల అంజిబాబు ఇంటికి ఆయన బావమరిది శీలం వెంకటేశ్ 2021, ఫిబ్రవరి 13న వచ్చాడు. సాయంత్రం బయటకు వెళ్లగా, రాత్రి 9–30 గంటల సమయాన కత్తిపోట్లకు గురైన ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈక్రమంలో అంజిబాబు భార్య వెంకటేశ్ను వివరాలు ఆరా తీయగా.. ఖమ్మం వినోద థియేటర్ వద్ద ఓ మహిళతో మాట్లాడుతుండగా.. రాపోలు వెంకటేశ్వర్లు వచ్చి తనతో సన్నిహితంగా ఉండే ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ కత్తితో పొడిచాడని వెల్లడించాడు. దీంతో ఖమ్మం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. చికిత్స పొందుతూ వెంకటేశ్ మరణించడంతో హత్య కేసుగా మార్చి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో 12 మంది సాక్షులను విచారించాక వెంకటేశ్వర్లుపై నేరం రుజువు కావడంతో జీవితఖైదు విధించడమే కాక రూ.10 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరపున పి.స్వప్న వాదించగా ఉద్యోగులు శ్రీకాంత్, మారగాని రామకృష్ణ, ఓరుగంటి శ్రీను సహకరించారు.
రాష్ట్ర అసోసియేషన్లో ఉండలేం..
● ఉమ్మడి జిల్లా రైస్మిల్లర్స్
అసోసియేషన్ ప్రతినిధుల వెల్లడి
వరంగల్ చౌరస్తా: రైస్మిల్లర్స్ రాష్ట్ర అసోసియేషన్ నుంచి వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యవర్గం వైదొలుగుతున్నట్లు ప్రతినిధులు ప్రకటించారు. హంటర్ రోడ్డులో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. మిల్లర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించిన రాష్ట్ర నాయకత్వంపై అవిశ్వాసం పెడుతున్నట్లు ప్రకటించారు. మిల్లర్ల హక్కుల పరిరక్షణ కోసం స్వతంత్రంగా ముందుకు సాగాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గోనెల రవీందర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ , కోశాధికారి ఇరుకుల కోటేశ్వర్ రావు, గౌరవ అధ్యక్షుడు తోట సంపత్ కుమార్, సలహాదారులు ప్రభాకర్రావు, దుబ్బా రమేశ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్ కుమార్, మాటేటి ప్రదీప్చంద్ర పాల్గొన్నారు.


