హస్తం గెలిచి.. కారు నిలిచి
మూడో దశ ఎన్నికల్లో హనుమకొండ జిల్లాలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం
సాక్షి, ప్రతినిధి, వరంగల్:
హనుమకొండ జిల్లాలో బుధవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో గెలిస్తే...బీఆర్ఎస్ పార్టీ కూడా తామేమీ తక్కువకాదంటూ గట్టి పోటీనిచ్చింది. ఆత్మకూరు, నడికూడ, దామెర, శాయంపేట మండలాల్లోని 68 పంచాయితీల్లో 37 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే...22 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. బీజేపీ పార్టీ నాలుగు, స్వతంత్రులు ఐదు స్థానాల్లో నెగ్గారు. ఈ ఐదుగురు స్వతంత్రుల్లో శాయంపేట, పత్తిపాక, తెహరపూర్ పంచాయితీల్లో ముగ్గురు కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. పరకాల నియోజకవర్గంలోనే ఈ నాలుగు మండలాలు ఉండడంతో ఎమ్మెల్యే రేవూరికి కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలవడం కాస్త సంతృప్తినిచ్చినా, బీఆర్ఎస్ కూడా ప్రభావం చూపడం హస్తం పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగనుండడంతో అప్పటివరకు ఎక్కడా బలహీనంగా ఉన్నామో, అందుకు గల కారణాలు విశ్లేషించుకొని ముందుకెళ్లాలన్న చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది.
పట్టు నిలుపుకున్న డీసీసీ అధ్యక్షుడు
ఆత్మకూరు: హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి స్వగ్రామం ఆత్మకూరులో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరి గెలుపొందారు. మహేశ్వరి గెలుపు కోసం వెంకట్రామ్రెడ్డి ప్రచారం నిర్వహించారు. తన మద్దతుదారు గెలవడంతో వెంకట్రామ్రెడ్డి అభినందనలు తెలిపారు. మహేశ్వరి గెలుపు సొంత గ్రామంలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనకు తొలి విజయమని ఆయన పేర్కొన్నారు.
వరంగల్లో హస్తం హవా
సాక్షి, వరంగల్: పంచాయతీ మూడో విడత పోరులో కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందారు. చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో 109 పంచాయతీల్లో 72 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిస్తే.. 33 మంది బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ ఖాతా కూడా తెరవలేకపోయింది.
నలుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత మండలం చెన్నారావుపేట మండలంలో 30 పంచాయతీలకు 22 స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంది. ఏడు స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ 6 మేజర్, పెద్ద పంచాయతీల్లో పాగా వేయడం కాస్త ప్రతికూలమనే చర్చ జరుగుతోంది. చెన్నారావుపేట, పాపాయిపేట, జల్లీ, లింగగిరి, తిమ్మరాయినిపహాడ్ మేజర్, ఎక్కువ ఓటర్లున్న గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. ముఖ్యంగా చెన్నారావుపేట మేజర్ గ్రామ పంచాయతీలో 11 వార్డులు కాంగ్రెస్ గెలుచుకున్నా.. సర్పంచ్ మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే దొంతి సొంతూరు అమీనాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి ధారా రజిత విజయం సాధించడం కాస్త ఊరటనిచ్చినట్లయ్యింది. ఖానాపురం మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ గెలవగా, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని పెద్ద పంచాయతీల్లో హస్తం పైచేయి సాధించింది.
మూడో విడత ఫలితాలు..
హనుమకొండ జిల్లాలో..
మండలం పంచాయతీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు
ఆత్మకూరు 16 10 4 1 1
నడికూడ 14 08 06 0 0
దామెర 14 04 08 02 0
శాయంపేట 24 15 04 01 04
మొత్తం 68 37 22 4 5
వరంగల్ జిల్లాలో..
చెన్నారావుపేట 30 22 7 0 01
ఖానాపూర్ 21 12 09 0 0
నర్సంపేట 19 11 06 0 02
నెక్కొండ 39 27 11 0 01
మొత్తం 109 72 33 0 04
దామెర మండలంలో బీఆర్ఎస్ జోరు, నడికూడలోనూ ప్రభావం
శాయంపేట: 24 పంచాయితీల్లో 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు
వరంగల్ 66 స్థానాల్లో కాంగ్రెస్, 34చోట్ల బీఆర్ఎస్ విజయం
హస్తం గెలిచి.. కారు నిలిచి


