ఆరబెట్టలేక.. అమ్ముకోలేక!
అకాల వర్షాలతో
పత్తిలో అధిక తేమ
పత్తి ధర, సాగు విస్తీర్ణం,
దిగుబడి వివరాలు..
పాత పద్ధతితోనే రైతుకు మేలు
వరంగల్: పండించిన పత్తిని రైతులు మద్దతు ధరకు అమ్ముకునే పరిస్థితులు కనిపించట్లేదు. అకాల వర్షాలతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈదుస్థితి ఏర్పడింది. పత్తిలో 8 శాతం తేమ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.8,110 ఇస్తామని సీసీఐ వెల్లడించింది. ప్రతీ అదనపు శాతానికి రూ.81 కోత ఉంటుందని ఇప్పటికే పేర్కొంది. అది కూడా 12 శాతం వరకే. అంతకుమించితే కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేసింది. ఇదే ఇప్పుడు పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆరబెడదామంటే అనువైన పరిస్థితులు లేవు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పత్తిని ఆరబెట్టుకోలేక, ఇంట్లో నిల్వ చేస్తే తేమ శాతం పెరిగే అవకాశాలున్నాయి. దీంతో మార్కెట్కు తీసుకొచ్చి రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. మద్దతు ధర కంటే సుమారు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు తక్కువగా అమ్మడంతో రైతులు నష్టపోతున్నారని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో 60 కొనుగోలు కేంద్రాలు..
సీసీఐ నిర్దేశించిన దానికంటే పత్తిలో తేమ ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం అన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో 60 సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు మార్కెటింగ్ అధికారులు సిద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లాలో 28, హనుమకొండలో 3, జనగామలో 15, మహబూబాబాద్ 6, భూపాలపల్లి 5, ములుగులో 3 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో భాగంగా సోమవారం లాంఛనంగా వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాలతోపాటు మక్కల కొనుగోలు కేంద్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రారంభిస్తారని వరంగల్ జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ తెలిపారు. పత్తిలో తేమ శాతం కారణంగా మిగిలిన కేంద్రాలను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పత్తిలో తేమ 8 శాతం ఉంటే మద్దతు ధర రూ.8,110 చెల్లిస్తారు. 9 శాతం ఉంటే రూ.8,028, 10 శాతం ఉంటే రూ.7,947, 11 శాతం ఉంటే రూ.7,866, 12 శాతం ఉంటే 7,785.60 ధర చెల్లిస్తారు.
12 శాతం మించితే
కొనుగోలు చేయమంటున్న సీసీఐ
నేడు ఏనుమాముల మార్కెట్లో
కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న అటవీ, దేవాదాయ శాఖ మంత్రి
కొండా సురేఖ
గతంలో సీసీఐ కొనుగోలు చేసిన పద్ధతితోనే రైతులకు ఇబ్బందులు ఉండవు. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుని సంబంధిత కేంద్రానికి తీసుకొస్తే తేమ ఎక్కువ ఉందని అంటే రైతు సరుకు వాపస్ తీసుకుపోవాల్సి వస్తోంది. దీని వల్ల రవాణా చార్జీలు అదనంగా భరించాలి. రైతు ఇష్టం ఉన్న కేంద్రంలో అమ్ముకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దేశంలో పలుచోట్ల ఈపద్ధతిపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పంజాబ్లో గొడవలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో సైతం ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిసింది. రైతు పట్టా పాస్బుక్, బ్యాంకు ఖాతాలను పరిగణనలోకి తీసుకుని కొనుగోలు చేస్తే బాగుంటుంది.
– బొమ్మినేని రవీందర్రెడ్డి, కాటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
ఆరబెట్టలేక.. అమ్ముకోలేక!


