
సెంట్రల్ జోన్ డీసీపీ బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న షేక్ సలీమాను హైదరాబాద్ సీఐడీ విభాగానికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆమె స్థానంలో ఇంకా ఎవరికి పోస్టింగ్ ఇవ్వలేదు.
ఆర్టీఐతో సుపరిపాలన
రామన్నపేట/కాళోజీ సెంటర్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)–2005 ద్వారా ప్రజలకు సుపరిపాలన అందుతుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) డాక్టర్ శ్రీధర్ సుమన్ ఆన్నారు. రాష్ట్ర సమాచార కమిషన్, కలెక్టర్ ఆదేశాల మేరకు ‘ఆర్టీఐ ద్వారా సుపరిపాలన‘ అంశంపై జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని ఏవీవీ జూనియర్ కళాశాలలో పోటీలను ఆయన పరిశీలించి మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపాల్ భుజేందర్, కార్యక్రమ నిర్వాహకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాసరావు, అధ్యాపకులు అనిత, శ్రీధర్, శ్రీనివాస్, సంజీవ, గోపి పాల్గొన్నారు.
వైద్యవిద్యకు ఆర్థికసాయం అభినందనీయం
హన్మకొండ: వైద్య విద్యలో ప్రవేశం సాధించి ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు నీట్–మెడికో పేరెంట్స్ అసోసియేషన్ అండగా నిలిచి చేయూతనందించడం అభినందనీయమని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.వి.నందకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో నీట్–మెడికో పేరెంట్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో వైద్యవిద్యలో ప్రవేశం పొందిన 10 మంది విద్యార్థులకు మొత్తం రూ.2.70 లక్షలు వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.వి.నందకుమార్రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ కె.నాగార్జునరెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించారు. వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ.. ఫీజు చెల్లించే స్థోమత లేని 30 మంది విద్యార్థులకు నెలకు రూ.3,500 వచ్చే ఏర్పాట్లు చేస్తానన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో బుక్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. నీట్–మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణచారి, సభ్యులు రావు ల మధు, ఆకుల భాస్కర్, నరేందర్, యాదగిరి, కందిమల్ల జితేందర్, ఇందిర, రోజా, బాబు రావు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
● చికిత్స పొందుతూ మృతి
బచ్చన్నపేట : పాముకాటుతో చికిత్స పొందుతున్న ఓ యువకుడు శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని బోనకొల్లూర్ గ్రామానికి చెందిన దయ్యాల పద్మ–కనకయ్య దంపతుల కుమారుడు రాకేశ్ (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ నెల 4వ తేదీన వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రాకేశ్కు పాముకాటు వేసింది. అయితే పాము కనిపించకపోవడంతో తేనెటీగ కుట్టిందని అదే రోజు గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జనంలో పాల్గొని భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు కాలు తిమ్మిరిగా ఉండడంతో జనగామ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సెంట్రల్ జోన్ డీసీపీ బదిలీ

సెంట్రల్ జోన్ డీసీపీ బదిలీ