
ధూపదీపనైవేద్య అర్చకులకు వేతనాలు అందించాలి
హన్మకొండ కల్చరల్ : గ్రామాల్లోని ధూపదీపనైవేద్య అర్చకులకు సక్రమంగా ప్రతీనెలా వేతనాలు అందేలా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగజాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర చేనేత భవన్లో నూతనంగా పదవీబాధ్యతలు చేపట్టిన దేవాదాయధర్మాదాయశాఖ కమిషనర్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజరామయ్యర్ను గంగు ఉపేంద్రశర్మ, పరాశరం రవీంద్రాచారి, దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి, ఇతర అర్చకులు కలిసి శుభాకాంక్షలు తెలిపి వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అర్చక ఉద్యోగుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అనేక దేవాలయాల్లో క్యాడర్ స్ట్రెంత్లేక ఇబ్బంది పడుతున్నారని, ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని వివరించారు. ప్రమోషన్ల విషయంలో సంబంధిత అధికారులతో జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకుంటానని కమిషనర్ పేర్కొన్నారు.
11,12 తేదీల్లో ఇంటర్ కాలేజీ కబడ్డీ టోర్నమెంట్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ కాలేజీలకు ఇంటర్ కాలేజీ కబడ్డీ టోర్నమెంట్ ఈనెల 11, 12వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ టి. మనోహర్ తెలిపారు. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్, సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్కు సెలక్షన్స్ కూడా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కేయూ పరిధి లోని డిగ్రీ, పీజీ కాలేజీల నుంచి కబడ్డీ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నారని తెలిపారు. ఈ టోర్నమెంట్ ప్రారంభ కా ర్యక్రమంలో ముఖ్యఅతిథులుగా కేయూ రిజి స్ట్రార్ వి రామచంద్రం, స్పౌర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య పాల్గొంటారని చెప్పారు.
ప్రతినెలా 1న జీతాలు చెల్లించాలి
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కోరారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ గెస్ట్హౌస్లో జేఏసీ ఎన్పీడీసీఎల్ శాఖ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 9వ తేదీ వరకు ఉద్యోగులకు జీతాలు అందకపోవడంపై చర్చించారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, సీఎండీ పేషీలో అధికారికి వినతి పత్రాలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జీతాలు ఆలస్యమైతే వైద్య ఖర్చులు, అప్పుల వాయిదాలు, కుటుంబ అవసరాలకు అవస్థలు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎ.విజేందర్ రెడ్డి, కేవీ.జాన్సన్, ఎస్.మల్లికార్జున్, బండారి ప్రభాకర్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

ధూపదీపనైవేద్య అర్చకులకు వేతనాలు అందించాలి

ధూపదీపనైవేద్య అర్చకులకు వేతనాలు అందించాలి