
కొలిక్కిరాని టెండర్లు
హన్మకొండ చౌరస్తా: ఉచిత చేప పిల్లల పంపిణీపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. చెరువుల్లో జూన్, జూలై నెలల్లో వదలాల్సిన చేపపిల్లలను ఇంతవరకూ అందించలేదు. సెప్టెంబర్ మొదటి వారం గడిచినా టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాకపోవడం ఇందుకు నిదర్శనం. సరైన సమయానికి చేప పిల్లలను అందిస్తే ఇప్పటి వరకు చేప ఎదిగి కనీసం పావుకిలో ఉండేదని, ఇప్పుడు చెరువుల్లో వదిలితే అవి ఎప్పుడు ఎదగుతాయని మత్స్యకారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 813 చెరువులు ఉన్నాయి. గత సంవత్సరం 763 చెరువుల్లో రూ.82.82 లక్షల విలువైన 111.21 లక్షల ఉచిత చేపపిల్లల్ని పంపిణీ చేసినట్లు, సుమారు రూ.3.67 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
సొంతంగా కొని..
మత్స్యశాఖ అధికారులపై నమ్మకం లేని పలు మత్స్య సొసైటీలు ఇప్పటికే వారి పరిధిలోని కొన్ని చెరువుల్లో చేప పిల్లలను వదిలినట్లు సమాచారం. రెండు నెలల క్రితమే జిల్లాలోని పలువురు సొసైటీ సభ్యులు సొంత డబ్బులతో చేప పిల్లలను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా చెరువుల్లో 200 గ్రాముల మేర చేప ఎదిగిందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల్లో నాణ్యతపై మత్స్యకారులు ఏటా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చేప పిల్లల కనీస సైజు 35 నుంచి 40 ఎంఎం ఉండాలని అధికారులు చెబుతున్నప్పటికీ అమలులో ఎక్కడా కనిపించడం లేదని మత్స్యకారులు బహిరంగంగానే వాపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.
టెండర్లను ఆహ్వానించాం..
జిల్లాలోని 813 చెరువుల్లో 220.55 లక్షల ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం టెండర్లను ఆహ్వానించాం. ఇప్పటి వరకు వరంగల్ జిల్లాకు ఇద్దరు, హనుమకొండ జిల్లా నుంచి ఒక్కరు టెండర్లు దాఖలు చేశారు. ఈ నెల 12వ తేదీ వరకు టెండర్లు వేయడానికి అవకాశం ఉంది.
– నాగమణి, ఇన్చార్జ్ జిల్లా మత్స్యశాఖ అధికారి, హనుమకొండ
ఉచిత చేప పిల్లల పంపిణీలో
అలసత్వం
చెరువుల్లో ఇప్పుడు వదిలితే
ఎదుగుదల అంతంతే..
అధికారుల తీరుపై మత్స్యకారుల
అసహనం