
రెనోవా బన్ను ఆస్పత్రి ప్రారంభం
● సామాన్యులకు అందుబాటులో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స
ఎంజీఎం : ప్రజలకు ప్రపంచ స్థాయి నాణ్యతతో క్యాన్సర్ చికిత్స అందించేందుకు రెనోవా బన్ను ఆస్పత్రిని ప్రారంబించినట్లు రెనోవా గ్రూపు ఆస్పత్రి ఫౌండర్ సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ములుగు రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిని సోమవారం ఆరోగ్యవర్సిటీ వీసీ నందకుమార్రెడ్డి, రిజిస్ట్రార్ నాగార్జునారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ ప్రాంతంలో తొలి సమగ్ర క్యాన్సర్ ఆస్పత్రిగా రెనోవా బన్ను ఆస్పత్రి నిలుస్తుందని తెలిపారు. ఈ ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలైన దాదాపు రూ. 20 కోట్ల విలువైన హెల్కాయిన్ ఇమేజ్ గైడెడ్ రేడియేషన్, దాదాపు రూ.6 కోట్ల విలువైన పెట్ సిటీ పరికరాలతో అంతర్జాతీయ స్థాయి చికిత్స సదుపాయాలు వరంగల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రభాకర్రావు, ఐఎంఏ ప్రతినిధులు పాల్గొన్నారు.