
విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే మెరుపు సమ్మె
హన్మకొండ: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలని చూస్తోందని, ఇదే జరిగితే దేశ వ్యాప్తంగా మెరుపు సమ్మెకు దిగుతామని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ హెచ్చరించారు. ఉత్తర్ ప్రదేశ్లో కార్మికుల హక్కుల కాలరాసేలా పోరాటాలు, సమ్మె చేయకుండా రెగ్యులరైజేషన్ అమైండ్మెంట్ తీసుకురావడాన్ని నిరసిస్తూ అక్కడి విద్యుత్ ఉద్యోగులకు మద్దతుగా గురువారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మధ్యా హ్న భోజన సమయంలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఎక్కువ ఇబ్బందులుంటాయన్నారు. ఉద్యోగావకాశాలు పోతాయన్నారు. ప్రైవేట్ నిర్వాహకులను భరించలేమన్నారు. ఈ క్రమంలో ప్రజలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఎన్పీడీసీఎల్ బాధ్యుడు సామ్యా నాయక్ మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ ఉద్యోగుల పట్ల అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఇక్కడ ధర్నా చేశామన్నారు. ఈ ధర్నాలో శ్రీకాంత్, వెంకటేశం, కుమారస్వామి, జానకీరాంరెడ్డి, మధుకర్, పి.మహేందర్ రెడ్డి, మచ్చిక బుచ్చయ్య గౌడ్, చిట్ల ఓదెలు, తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్