
ఇక నో టెన్షన్
సైబర్ ఎటాక్..
కాజీపేట మండలం మడికొండకు ఓ యువకుడు లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుని రికవరీ ఏజెంట్ల బారినపడ్డాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో రూ.1.60 లక్షల మొత్తం చెల్లించారు. అయినా మరికొంత చెల్లించాలని డిమాండ్ చేసి.. ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడంతో తెలివిగా ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియా ఖాతాల నుంచి తప్పుకుని తన ఫోన్ హ్యాక్ అయ్యినట్లు ప్రకటించాడు
కాజీపేట: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక జనగామ జిల్లా చిల్పూరు మండలం లింగపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లైన నలబై రోజులకే ఆత్మహత్యకు ఒడిగట్టాడు. కేవలం రూ.2వేల కోసం భార్యభర్తల ఫొటోలను మార్ఫింగ్ చేసి బంధువులకు పంపడంతో మనస్తాపానికి గురై తనువు చాలించాడు.
మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి రూ. 15వేల రుణం తీర్చే క్రమంలో వేధింపులకు గురైంది. అవమానంగా భావించిన సదరు యువతి.. పురుగు ల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఇలా.. ఇటీవల రుణయాప్ నిర్వాహకుల వేధింపులకు బలవుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో యువత, విద్యార్థులు, మహిళలే ఎక్కువ ఉంటున్నారు. పూర్తిగా చెల్లించినా బాకీ ఇంకా ఉందంటూ.. ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతుండడం సైబర్ కేటుగాళ్ల తెగింపునకు పరాకాష్టగా నిలుస్తోంది. దీంతో బాధితులు మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు.. ఆ సైబర్ దాడి నుంచి రక్షించుకునేందుకు ఓ వెబ్సైట్ అందుబాటులో ఉంది. దీనిపై అవగాహన పెంచుకుంటే ఏ సందర్భంలోనైనా ఉపయోగపడుతుందని పోలీసులు చెబుతున్నారు. ఆ వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సైట్కు ఫిర్యాదు చేయొచ్చు..
మీ ఫొటోలతో అశ్లీల చిత్రాలు రూపొందించి ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తుంటే నేరుగా ఫిర్యాదు చేయొ చ్చు. ఇందు కోసం మీ సెల్ఫోన్కి వచ్చిన ఫొటోల ను ఈ సైట్కు పంపాలి. ఇందులో తొమ్మిది రకాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మే రకు వివరాలు నమోదవుతాయి. తర్వాత ఫొటోలు అప్లోడ్ చేస్తే వాటిపై సదరు సైట్ నిఘా పెడుతుంది. ఎవరైనా ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పో స్ట్ చేస్తే వెంటనే గుర్తించి తొలగిస్తుంది. ఆ వివరాల ను నోటిఫికేషన్ రూపంలో మీకు తెలియజేస్తుంది.
– పింగిళి ప్రశాంత్ రెడ్డి, ఏసీపీ, కాజీపేట
ఫొటో మార్ఫింగ్ బెదిరింపు నుంచి రక్షణ పొందండిలా!
రుణయాప్ వేధింపుల అడ్డుకట్టకో సైట్
అవగాహన పెంచుకోవాలంటున్న పోలీసులు
2015 నుంచే అందుబాటులోకి..
ఈ జాగ్రత్తలు మేలు..
సామాజిక మాధ్యమాల విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫొటోలను అప్లోడ్ చేయకపోవడమే మంచిదని..ఒక వేళ చేసినా ఇతరులకు వాటి యాక్సెస్ లేకుండా జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. ప్రొఫైల్ చిత్రాలను ఇతరులకు డౌన్లోడ్ కాకుండా లాక్ వేయాలి. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే రిక్వెస్ట్లు, లింక్లను ఎట్టి పరిస్థితులలోనూ ఆమోదించొద్దు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారిని బ్లాక్లిస్ట్లో పెట్టడం సురక్షితమని వివరిస్తున్నారు.
ఆ సైట్ పేరు..
www.sotpncii.org అంతర్జాతీయంగా నిర్వహించే ఈ వెబ్సైట్ పూర్తిగా భద్రమని పోలీసులు చెబుతున్నారు. మనం అప్లోడ్ చేసిన ఫొటోలను డౌన్లోడ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం ఉండదు. డిజిటల్ ఫింగర్ ప్రింట్ తరహాలో.. మన చిత్రంతో ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. దీని ఆధారంగా సామాజిక మాధ్యమాల్లో మన చిత్రాలు అప్లోడ్ అయితే .. అధునాతన సాంకేతికత ఆధారంగా గుర్తించి వెంటనే తొలగిస్తుంది. 2015 లోనే అందుబాటులోకి వచ్చింది. ఈ సైట్ ఇప్పటి వరకు అంతర్జాతీయంగా రెండు లక్షల మందికి పైగా బాధితుల మార్ఫింగ్ చిత్రాలను తొలగించి వారికి వ్యక్తిగత రక్షణ కల్పించింది.
పూర్తిగా
సురక్షితం..
అప్రమత్తంగా ఉండాలి
ఫొటోలు మార్ఫింగ్, రుణ యాప్ వేధింపులు ఎదురైతే భయపడకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. తద్వారా వారికి అండగా నిలిచి .. అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం.

ఇక నో టెన్షన్