
డంపింగ్ యార్డులో మగశిశువు మృతదేహం
మడికొండ : మడికొండ–రాంపూర్ గ్రామాల మధ్య ఉన్న డంపింగ్ యార్డులో నవజాత శిశువు మృతదేహం లభించినట్లు మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ శుక్రవారం తెలిపారు. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. డంపింగ్ యార్డులో పని చేస్తున్న సిబ్బందికి శిశువు మృతదేహం కనిపించగా మడికొండకు చెందిన బైరి లింగమూర్తికి సమాచారం ఇచ్చారు. లింగమూర్తి వెంటనే ఇన్స్పెక్టర్ కిషన్కు విషయం తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న కిషన్ మృతదేహాన్ని పరిశీలించి చనిపోయినది మగ శిశువుగా గుర్తించారు. లింగమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కిషన్ తెలిపారు. పంచనామా నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. శిశువు మృతదేహం ఇక్కడకు ఎలా వచ్చిందో తెలియడం లేదని, నగరంలోని ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రి నుంచి తీసుకొచ్చి పడేశారా లేక ఇతరులు ఎవరైనా పడేశారా అని పరిశీలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కిషన్ వివరించారు.