
ఆఫీసర్స్ క్లబ్ నిధుల్లో అక్రమాలు
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్స్టేషన్ పరిధి ఆఫీసర్స్ క్లబ్లో మేనేజర్ ముసుగులో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. 2015 సంవత్సరంలో గోలి గోపాల్రెడ్డి ఆఫీసర్స్ క్లబ్లో చేరి సభ్యత్వం కోసం వచ్చే వారి నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1,40 లక్షలు వసూలు చేసి ఆ మొత్తాన్ని క్లబ్ అకౌంట్లో జమ చేయకుండా ఇలా రూ.130 కోట్లు సొంతానికి వాడుకున్నట్లు పేర్కొన్నారు. గోలి గోపాల్రెడ్డి క్లబ్లో షటిల్ బాయ్గా పనిచేస్తున్న పొడిశెట్టి రవీందర్కు డబ్బు ఆశచూపి ఏడుగురు సభ్యులను తీసుకురాగా వారి నుంచి రూ.1.50 లక్షల చొప్పున వసూలు చేసి అకౌంట్లో జమచేయలేదని తెలిపారు.
అలాగే.. 2019లో జాయింట్ సెక్రటరీగా ఉన్న చెరుకు వెంకటరాజిరెడ్డి ముగ్గురు సభ్యుల డబ్బులు రూ.4.20 లక్షలు, ఇతర డబ్బులు రూ.60 లక్షలు కూడా సొంతానికి వాడినట్లు వివరించారు. అంతేకాకుండా క్లబ్లో పనిచేస్తున్న శ్రీనివాస్కు రూ.10 లక్షలు ఇస్తానని ఆశ చూపి ఇవ్వకపోవడంతో అతను 2024 ఏప్రిల్ 18న క్లబ్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. తన ఆత్మహత్యకు గోలి గోపాల్రెడ్డి, రాజిరెడ్డి, రవీందర్ కారణామని శ్రీనివాస్ తన కుమారుడికి ఫోన్లో వీడియో పంపడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. క్లబ్ డబ్బులు రూ.2 కోట్లు సొంతానికి వాడుకోవడమే కాకుండా.. శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన ఆ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు, ఏఎస్సై వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసస్వామి, రోషన్ అలీ, కానిస్టేబుళ్లు ఉమేష్, దేవేందర్లను ఇన్స్పెక్టర్ అభినందించారు.
రూ.2కోట్లు స్వాహా.. ముగ్గురి అరెస్టు