ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ అధికారులు పరీక్షల నిర్వహణ తేదీల నోటిపికేషన్ విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నాయి. మొదటి సెమిస్టర్ ఫలితాలు ఇవ్వకుండానే రెండవ సెమిస్టర్ పరీక్షల తేదిలను ప్రకటించడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2026 ఫిబ్రవరి 23 నుంచి 28 వరకూ ఆరు రోజులపాటు బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఇప్పటి వరకూ వెల్లడించలేదు. పరీక్షలు జరిగి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా పరీక్ష ఫలితాలు ప్రకటించని వర్సిటీ అధికారులు 2026 మే 20వ తేదీ నుండి 23 వరకూ బీఈడీ రెండవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పలువురు బీఈడీ కళాశాలల నిర్వాహకులు జోక్యంతో ఆ పరీక్షల తేదీలను తాత్కాలికంగా వాయిదా వేశారు. అదే రెండవ సెమిస్టర్ పరీక్షలను జూన్ 22వ తేది నుండి 26వ తేది వరకూ నిర్వహిస్తున్నట్లు మే 2వ తేదీన ప్రకటన చేశారు. వర్సిటీ నిబంధనల ప్రకారం సెమిస్టర్కి మరొక సెమిస్టర్కు మద్య కనీసం 90 రోజుల వ్యవధి ఉండాలి. వర్సిటీ అధికారులు ఇటీవల ప్రకటిస్తున్న పరీక్షల తేదీలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. దీంతో విద్యార్థులు ఆయా సబ్జెక్ట్ల సిలబస్ పూర్తికాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరీక్షలకు వర్సిటీ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి దాదాపు 6000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికై నా వర్సిటీ ఉన్నతాధికారులు విద్యార్థుల భవిష్యత్ను, ఇబ్బందులను దృష్టి పెట్టుకుని పరీక్ష తేదీలను ఖరారు చేయాలని, పరీక్ష నిర్వహణ గడుపు పొడిగించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఏఎన్యూ పరిధిలోని పలు కళాశాలల నిర్వాహకులు కోరుతున్నారు.
నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా తయారు చేయాలి
డీఆర్వో షేఖ్ ఖాజావలి
గుంటూరు వెస్ట్: భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టినట్లు జిల్లా రెవెన్యు అధికారి షేఖ్ ఖాజావలి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి సిబ్బందిగా పనిచేస్తారన్నారు. బూత్ స్థాయి అధికారులు(బీఎల్వో ) లు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితా నిర్వహణ బాధ్యత పూర్తిగా బీఎల్ ఓ లదే అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ సమయంలో బీల్వో ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా సేకరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు , తెనాలి ఆర్డీఓ రమణి, డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు.
ఏపీఎం సోమశేఖర్కు రిమాండ్
కాకుమాను: పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన ఏపీఎం సోమేశేఖర్ను కాకుమాను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీఎం సోమశేఖర్ గతంలో కాకుమానులో పనిచేశారు. ఈ క్రమంలో గరికపాడు గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యుల డబ్బులను దుర్వినియోగం చేశారనే ఫిర్యాదుతో 2023లో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పొన్నూరు అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఏపీఎం సోమశేఖర్, అతడితోపాటు సీసీ సుబ్బారావుకు నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్ను కోర్టు జారీ చేసింది. ఈక్రమంలో ఏపీఎం, సీసీలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు 24వ తేదీ వరకు రిమాండ్ విధించారు. గుంటూరు సబ్ జైలుకు తరలించారు.


