నరసరావుపేట రూరల్: పది వేలు చెల్లిస్తే పది కోట్లు ఇస్తామంటూ స్కీమ్ను ప్రారంభించి అమాయక ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని నరసరావుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ శివారు ప్రాంతమైన కేసానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్టీ నగర్లో రెండు రోజుల క్రితం చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన నాగండ్ల వెంకట్రావు కార్యాలయాన్ని ప్రారంభించాడు. వెంకట్రావు కోకోనట్ మర్చంట్ పేరుతో ప్రారంభించిన కార్యాలయానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో స్కీమ్లో సభ్యుల నుంచి నిర్వాహకులు ఈకేవైసీ తీసుకుంటున్నట్టు సేకరిస్తున్నట్టు గుర్తించారు.
పథకాలను మాజీ సైనికులు
సద్వినియోగం చేసుకోండి
మాచర్ల రూరల్: మాజీ సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగపర్చుకోవాలని సైనిక సంక్షేమ ఉమ్మడి జిల్లా శాఖాధికారి ఆర్.గుణశీల కోరారు. శనివారం పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబాల కోసం ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుందని సాగు భూమితో పాటు పిల్లల చదువులలో రిజర్వేషన్, క్యాంటీన్లో సబ్సిడీపై అందించే వివిధ వస్తువులను సకాలంలో తీసుకోవాలని కోరారు. విద్యకు స్కాలర్షిప్, కుమార్తె వివాహానికి నగదు, వైకల్య గ్రాంటు, ఈసీహెచ్ఎస్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలను అందుకోవాలన్నారు. మృతిచెందిన మాజీ సైనికుల భార్యలకు గుర్తింపు కార్డులను అందించారు. ఇటీవల అంగవైకల్యం పొందిన ఇన్నారెడ్డి గృహానికి వెళ్ళి పరామర్శించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కేపీ సిద్ధంరాజు, ప్రధానకార్యదర్శి తాటి వినోద్బాబు, కోశాధికారి ఆర్ గోపాల్ నాయక్, ఉపాధ్యక్షులు వి.మరియదాసు, సభ్యులు కారంకి శ్రీనివాసరావు, రామారావు, పి.బాబు, ఇన్నారెడ్డి, శేఖర్, రవి పాల్గొన్నారు.
పొన్నూరు: మామిళ్లపల్లి రైతులపై టీడీపీ నాయకులు దాడి చేసి అక్రమ కేసులు బనాయించిన నేపథ్యంలో రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదివారం రానున్నారని పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు మామిళ్లపల్లి అడ్డరోడ్డు నుంచి మామిళ్లపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.
లక్ష్మీపురం: ఓ ఇంట్లో 25 సవర్ల బంగారం, రూ.2.50 లక్షల నగదు చోరీ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. ముత్యాలరెడ్డినగర్ 8వ లైన్ ప్రాంతానికి చెందిన దుగ్గెంపూడి ప్రభాకర్రెడ్డి కన్స్ట్రక్షన్ పని చేస్తుంటారు. భార్య భూలక్ష్మి ఇంటి వద్దనే ఉంటుంది. ఇంట్లో బీరువాలో ఉన్న 25 సవర్ల బంగారం, అలాగే బీరువాలో ఉన్న రూ.2.50 లక్షల నగదు కనిపించలేదు. దీన్ని గమనించిన ప్రభాకర్రెడ్డి ఆయన సతీమణి భూలక్ష్మి, ఇంట్లో పని చేసే మహిళపై అనుమానం వ్యక్తం చేశారు. బాధితులు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


