గుంటూరు రూరల్: మండలంలోని పెదపలకలూరులో రీ సర్వే కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్వర్మ శుక్రవారం తనిఖీ చేశారు. రీ సర్వేలో చేపట్టిన కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులతో స్వయంగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. రైతులు చేస్తున్న పంటల సాగు, వాటి వివరాలు, పొందే ఆదాయం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. 481 ఎకరాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ పూర్తి చేసినట్లు సర్వే అధికారులు, సిబ్బంది తెలియజేశారు. రీ సర్వే ప్రక్రియకు ముందుగా రైతులకు నోటీసులు జారీ, ముందస్తు సమాచారం వంటి అంశాలను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు. రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వేకు అనుసరించాల్సిన కార్యక్రమాలను పక్కాగా చేపట్టాలన్నారు. రైతులకు ముందుగా తెలియజేసి, రీసర్వె పట్ల వివరాలను తెలియజేయాలన్నారు. రైతుల అభ్యంతరాలు ఉంటే వాటిని పరిగణలో తీసుకుని స్పష్టమైన విచారణ చేయాలని ఆదేశించారు. రీ సర్వే ద్వారా భూముల వివరాలు పక్కాగా నమోదు కావలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సర్వే శాఖ ఉపసంచాలకులు, తహసీల్దార్ సుభాని, స్థానిక రైతులు పాల్గొన్నారు.
నెహ్రూనగర్: నగరంలోని రామిరెడ్డితోటలో కౌమార దశ పిల్లల సమ్మర్ క్యాంప్ను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు కె.జి.వి.పద్మలత శుక్రవారం సందర్శించారు. క్యాంప్ జరుగుతున్న తీరును పరిశీలించి పిల్లలతో ముఖాముఖి మాట్లాడారు. బాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ, సాధికారత అధికారి ప్రసూన పాల్గొన్నారు.


