పంట కాలువలోకి పడిపోయిన ట్రాక్టర్ ట్రక్కు ఏడుగురు వ్యవసాయ కూలీలకు గాయాలు ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలింపు తప్పిన పెను ప్రమాదం
ప్రత్తిపాడు: వ్యవసాయ కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలో బోల్తా కొట్టిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పెదనందిపాడు మండలం రావిపాడు శివారులోని పొలాల్లో మిర్చి కోతలు కోసేందుకు శనివారం ఉదయం ప్రత్తిపాడు మండలం వంగిపురం గ్రామానికి చెందిన సుమారు 25 మంది వ్యవసాయ కూలీలు ట్రాక్టర్పై పొలానికి బయల్దేరారు. రావిపాడు–వంగిపురం డొంక రోడ్డులోని పెద్ద గొయ్యిలో ట్రాక్టర్ వెనుక చక్రం పడటంతో ట్రక్కు పక్కకు ఒరిగింది. డ్రైవర్ ట్రాక్టర్ను అదుపు చేయలేకపోవడంతో పక్కనే ఉన్న బోధి కాలువలోనికి ట్రాక్టర్ ట్రక్కు పడిపోయింది. ప్రమాదంలో ట్రక్కులో ఉన్న పాతిక మంది కూలీలు ఒకరిపై ఒకరు పడిపోయారు.
ఏడుగురికి గాయాలు
ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న గాండ్ల సీతారావమ్మ, ఉల్లంగుల అంజలి, అల్లూరి దుర్గ, ఉల్లంగుల వరలక్ష్మి, కొండేపాటి శివమ్మ, షేక్ జాన్బి, జి. స్వాతిలకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ప్రైవేట్ వాహనంలో ప్రత్తిపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్తో పాటు వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం వారిలో నలుగురికి గుంటూరు జీజీహెచ్కు తరలించారు.


