గ్రామస్థాయి నుంచి రైతులు ఉద్యమించాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం తొలగిపోవాలంటే రైతులు గ్రామస్థాయి నుంచి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అఖిలభారత కిసాన్ సభ ఫైనాన్స్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆదివారం రాత్రి ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు అధ్యక్షతన ‘కార్పొరేట్ వ్యవసాయం – రైతాంగం పై ప్రభావం’ అనే అంశంపై జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఏ పంట వెయ్యాలో రైతులకు కార్పొరేట్లే దిశా నిర్దేశం చేస్తున్నారని తెలిపారు. ఎక్కువ విస్తీర్ణంలో ఒకే పంట పండించడం వల్ల ధరలు తగ్గి రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఇందుకు గుంటూరులో గత రెండేళ్ల కాలంలో మిర్చి ధరల హెచ్చుతగ్గులే నిదర్శనం అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి ఉద్యమాలు రావాలన్నారు. ‘కేంద్ర బహుళ సహకార చట్టం – రైతాంగం పై ప్రభావం’ అనే అంశంపై రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకుడు వై. కేశవరావు, ‘వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి –సాగునీటి ప్రాజెక్టుల ఆవశ్యకత’ అనే అంశంపై ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు డి.హరనాథ్ తదితరులు ప్రసంగించారు.
ఏఐకేఎస్ ఫైనాన్స్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్


