కిడ్నీ రోగుల పరేషాన్ !
గుంటూరు జీజీహెచ్ వైద్యుల తీరుపై విమర్శలు గతంలో విజయవంతంగా మార్పిడి శస్త్రచికిత్సలు 22 నెలలుగా ఒక్క ఆపరేషన్ కూడా జరగని వైనం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగులు వ్యయప్రయాసలతో ఇబ్బంది పడుతున్న పేదలు
రోగుల వివరాలు ఇలా..
ప్రతి నెలలో 15 మందికిపైగా..
గుంటూరు మెడికల్: కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సీహెచ్ సందీప్కు గుంటూరు జీజీహెచ్లో 2023 డిసెంబరు 19న కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశారు. సుమారు రూ. 10 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్ ఉచితంగా నిర్వహించారు. నాటి నుంచి నేటి వరకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయకుండా జీజీహెచ్ వైద్యులు మిన్నకుండిపోతున్నా ఆసుపత్రి అధికారులు చోద్యం చూస్తుండటం పేద రోగుల పాలిట శాపంగా మారింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ. 20 లక్షలకుపైగా ఖర్చు అవుతోందని, అంత మొత్తంలో చెల్లించుకోలేక జీజీహెచ్కు వస్తుంటే వైద్యులు ఆపరేషన్లు చేయకుండా వాయిదా వేస్తున్నారని పలువురు రోగులు వాపోతున్నారు.
చుక్కలు చూపిస్తూ..
రోగులు ఆపరేషన్ కోసం జీజీహెచ్కు వస్తున్నా వైద్యులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 20 నెలలుగా నెఫ్రాలజీ, యూరాలజీ వైద్యులు పరస్పరం నెపం మోపుకొంటూ ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం వస్తున్న రోగులకు చుక్కలు చూపిస్తున్నారు. జీజీహెచ్లో కిడ్నీ జబ్బులతో 100 నుంచి 150 మంది నెఫ్రాలజీ వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. కొంతమందికి డయాలసిస్ ద్వారా నయం అవుతుంది. ఇలా నయం కాని 30 శాతం మందికి తప్పనిసరిగా కిడ్నీ మార్చాలి. ఆపరేషన్ చేస్తేనే వారి ప్రాణాలు నిలుస్తాయి. ఇలా పేదలకు, అటు ఆస్పత్రికి కూడా ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు వస్తాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కిడ్నీ ఆపరేషన్లు చేయించుకునేందుకు స్థోమత లేక ఎంతో మంది డయాలసిస్తోనే సరిపెట్టుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
2016 నుంచి కిడ్నీ ఆపరేషన్లు....
గుంటూరు జీజీహెచ్లో 2016 ఫిబ్రవరి నుంచి 24 మందికి విజయవంతంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిధులు రావడంతో కిడ్నీ, యూరాలజీ వార్డులు బాగా వృద్ధి చెందాయి. కరోనా కాలంలో రెండేళ్లు ఆగిన ఆపరేషన్లను సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. 2023 డిసెంబర్లో మళ్లీ శస్త్రచికిత్సలు ప్రారంభించారు. సూపరింటెండెంట్గా డాక్టర్ యశస్వి రమణ వచ్చాక కిడ్నీ రోగులు ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలకు చెందిన రోగులు ఆవేదన చెందుతున్నారు. వైద్యుల మధ్య సమన్వయలోపం, ఆస్పత్రి అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ దుస్థితి నెలకొంది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చొరవ తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
జీజీహెచ్లో రోజూ ఓపీకి వచ్చే కిడ్నీ రోగులు – 100 నుంచి 150 మంది
డయాలసిస్ అవసరమైన వారు – 80 నుంచి 100 మంది
కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు అవసరమయ్యే వారి సంఖ్య
– సుమారు 30 నుంచి 40 మంది
జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయించుకునేవారు తప్పనిసరిగా గుంటూరు జీజీహెచ్లో కిడ్నీ మార్పిడి కమిటీ వైద్యుల అనుమతి తీసుకోవాలి. దీనికంటే ముందు గ్రామంలోని రెవెన్యూ, పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. ఇలా ప్రతి నెలా సుమారు 15 మందికిపైగా ఆపరేషన్లకు అనుమతులు తీసుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసినా కొంత మేరకు రోగుల నుంచి ఫీజులు వసూలు చేస్తారు. మందులకు ప్రత్యేకంగా బిల్లులు చెల్లించాల్సిందే. సుమారు రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు దీనికి ఖర్చు అవుతోంది. జీజీహెచ్లో ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయటంతోపాటుగా ఏడాదిపాటు ఆరోగ్యశ్రీ ద్వారా మందులు కూడా ఉచితంగా ఇస్తారు.
కిడ్నీ రోగుల పరేషాన్ !


