కౌశల్ రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు సన్నద్ధం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: కౌశల్–2025 పేరుతో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ క్విజ్ పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక బుధవారం ఓప్రకటనలో తెలిపారు. భారతీయ విజ్ఞానమండలి, ఏపీ సైన్స్ సిటీ, అప్కాస్ట్ సంయుక్తంగా తిరుపతిలో నవంబర్ 27న జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8,9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు క్విజ్, రీల్ పోటీలతో పాటు, పోస్టర్ కాంపిటీషన్స్ జరుగుతాయని వివరించారు. పాఠశాలస్థాయిలో 8,9,10 తరగతుల విద్యార్థులకు నవంబర్ 1,2,3వ తేదీలతో పాటు జిల్లాస్థాయిలో నవంబర్ 27, 28వ తేదీల్లో పోటీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో బీఆర్క్ కోర్సు 1/5 మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. ఐదుగురు విద్యార్థులు పరీక్ష రాయగా ఐదుగురు ఉత్తీర్ణత సాధించారు. రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో 38 మందికి 34 మంది పాస్ అయ్యారు. ఎంబీఏ కోర్సు రెండవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో 754 మంది పరీక్షలు రాయగా వారిలో 610 ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యూయేషన్కు నవంబరు 3లోగా ఒక్కో పేవరుకు రూ.2070 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అలానే ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ కోర్సు 1/5 రెండవ సెమిస్టర్ జూలైలో జరిగిన పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు పరీక్ష రాయగా వారిలో ఒకరు ఉత్తీర్ణత సాధించారు. అలానే ఫార్మా డీ, ఎంఈడీ కోర్సు 4వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలను కూడా ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు.
తాడికొండ: క్వారీ గుంతలో పడి పశువుల కాపరి మృతి చెందిన ఘటన తాడికొండ మండలం కంతేరు గ్రామం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంతేరు గ్రామ శివారు ఆర్యూబీ సమీపంలోని హలోబ్రిక్స్ ఇండస్ట్రీ పక్కన ఉన్న క్వారీ గుంతల సమీపంలో పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన తోటా ప్రసాదరావు(65) అనే వృద్ధుడు మంగళవారం పశువులను మేపేందుకు ఉదయం 10 గంటల సమయంలో వెళ్లాడు. సాయంత్రం 04 గంటల సమయంలో క్వారీ గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడని తెలిసిన వ్యక్తి మృతుడి కుమారుడికి తెలపగా ఒడ్డున ఉన్న దుస్తులు గమనించి తన తండ్రికి చెందినవిగా గుర్తించి క్వారీ గుంతలలో గాలించినా ఎలాంటి ప్రయోజనం లభించలేదు. బుధవారం మృతుడి శవం నీటిలో తేలియాడటంతో గమనించి తాడికొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడని కుమారుడు తోటా సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.
మంగళగిరి టౌన్: సాక్షి దినపత్రిక మంగళగిరి రిపోర్టర్ ఇడమకంటి వెంకటేశ్వరరెడ్డి (52) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వరరెడ్డి మంగళవారం మధ్యాహ్నం అస్వస్థతతకు గురికావడంతో చికిత్స నిమిత్తం మంగళగిరి నగర పరిధిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. చికిత్స పొందుతుండగా బుధవారం ఉదయం మృతి చెందారు. వెంకటేశ్వరరెడ్డి స్వస్థలం నెలూరుజిల్లా, ఉదయగిరి. సుమారు దశాబ్దకాలం పైగా పాత్రికేయ రంగంలో విశేషసేవలు అందించారు. మంగళగిరి ప్రెస్క్లబ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మంగళగిరిలోని ఆయన నివాసంలో భౌతికకాయాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. వెంకటేశ్వరరెడ్డి అంత్యక్రియలు గురువారం ఉదయం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జర్నలిస్టులు, సాక్షి సిబ్బంది ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.


