
కూటమి సర్కార్ వివక్ష
న్యాయం చేయండి
దారుణం
ఆదుకోండి
తురకపాలెం మృతుల కుటుంబాలపై
● విషజ్వరాలతో 46 మంది మృతి
● 28 మంది మృతుల
కుటుంబాలకే ఆర్థిక సాయం
● 2024 డిసెంబర్ నుంచి
అంతుపట్టని మరణాలు
● 2025లో జూలై–సెప్టెంబర్
మధ్య మరణాలనే లెక్కేసిన వైనం
● మిగిలిన కుటుంబాలను
విస్మరించిన పరిస్థితి
● తమనూ ఆదుకోవాలంటూ
బాధిత కుటుంబాల వినతి పత్రాలు
గుంటూరు రూరల్: ఆర్థిక సహాయాన్ని అందజేయడంలో గుంటూరు జిల్లా తురకపాలెం విష జ్వరాల మృతుల కుటుంబాలపై ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శించింది. తురకపాలెంలో మెలియాయిడోసిస్ అనే అరుదైన వ్యాధి ప్రబలి గత ఏడాది డిసెంబర్ నుంచి 46 మంది మృత్యువాత పడ్డారు. అయితే జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో సంభవించిన 28 మరణాలనే పరిగణనలోకి తీసుకుంటూ, సంబంధిత కుటుంబాలకే ప్రభుత్వం ఆదివారం రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాల చేతుల మీదుగా ఇందుకు సంబంధించి చెక్కుల పంపిణీ జరిగింది. కాగా అరుదైన వ్యాధితో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నా.. సమస్య పరిష్కరించలేని ప్రభుత్వం తాజాగా ఆర్థిక సహాయం అందజేసే విషయంలోనూ వివక్ష ప్రదర్శించడం బాధిత కుటుంబాల్లో తీవ్ర అలజడి రేపింది.
మేం ఏం పాపం చేశాం..?
28 మంది మృతుల కుటుంబాలకే ఆర్థిక సహాయం అందడంతో, మిగిలిన బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయి. తాము ఏమి పాపం చేశామని తమకు ఆర్థిక సాయం అందలేదని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఆర్థిక సహాయానికి కేవలం మూడు నెలల్లో చోటుచేసుకున్న మరణాలనే లెక్కలోకి తీసుకోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలనూ ఆర్థికంగా ఆదుకోవాలని పలు బాధిత కుటుంబాలు కేంద్ర సహాయ మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్లకు వినతిపత్రాలు అందించారు.
అప్పులు చేసి ఆరు లక్షలతో నా భార్య షేక్ మహబుల్లాకు చికిత్స చేయించాను. అయినా ఫలితం లేదు. ముగ్గురు పిల్లలతో అప్పుల పాలై రోడ్డున పడ్డాను. ఆర్థిక సాయం చేసే జాబితాలో నా భార్య పేరు రాలేదు. న్యాయం చేయండి.
– షేక్ రషీద్
కూలీ నాలీ చేసుకుని కష్టపడి ఇద్దరు పిల్లలను చదివించుకుని బతుకులీడ్చుతున్నాం. లక్షలు ఖర్చుపెట్టి చికిత్స చేయించినా నా భార్య నాగేంద్రం ప్రాణాలు దక్కించుకోలేకపోయా. ఆర్థికసాయం అందించడంలో కొందరిని పట్టించుకోకపోవడం దారుణం. ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలి.
– బల్లెపల్లి వెంకటరావు
లక్షల వ్యయంతో దీర్ఘకాలం చికిత్స అందించినా నా భార్య సయ్యద్ జరీనాను కోల్పోయా. కొందరికి ఆర్థిక సాయం అందించి, కొందరిని ప్రభుత్వం విస్మరించింది. కావాలనే ఇలా చేశారా.. అన్న అనుమానమూ కలుగుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాను.
– జాకీర్

కూటమి సర్కార్ వివక్ష

కూటమి సర్కార్ వివక్ష