
సిరివర్షిణీ.. శిరసా నమామి
ఇంద్రకీలాద్రికి భక్తులు వెల్లువలా తరలివస్తూనే ఉన్నారు. ఎండా వానను లెక్కచేయక, కాలినడకన కొండెక్కి అమ్మ దర్శనం చేసుకుని తరిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు సైతం ఆత్మస్థైర్యంతో అడుగులు వేస్తూ సునాయాసంగా నడిచేసి భక్తిప్రపత్తులు చాటుకుంటున్నారు. శుక్రవారం అష్టలక్ష్మీ సమష్టి రూపమైన శ్రీమహాలక్ష్మీదేవిగా కనకదుర్గమ్మ కొలువయ్యారు. భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు సిరుల తల్లిని కనులారా వీక్షించారు. మా కల్పవల్లివి నీవే తల్లి అంటూ అంటూ ఐశ్వర్యసిద్ధి కోసం ప్రార్థించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శుక్రవారం శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం పైగా శ్రీమహాలక్ష్మీదేవి అలంకారం కావడంతో తెల్లవారుజామున నుంచే భక్తుల రద్దీ కనిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల నుంచి భక్తుల రాక ప్రారంభమైంది. దీంతో క్యూలైన్లో రద్దీ ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. ఉదయం 6 గంటలకే సర్వ దర్శనం, రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లు దేవస్థాన ఘాట్రోడ్డులోని టోల్గేట్ వరకు చేరాయి. మారిన టైం స్లాట్ మేరకు శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 7 గంటలకు వీఐపీలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక మిగిలిన సమయంలో అంతరాలయ గేట్లకు ఆలయ అధికారులు తాళాలు వేశారు. వీఐపీ టైం స్లాట్ మినహా మిగిలిన సమయంలో వచ్చిన వారికి బంగారు వాకిలి దర్శనం కల్పించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణానికి వీఐపీలు రాకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీయాగంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టినట్లు భక్తులు పేర్కొంటున్నారు. రూ. 100, రూ. 300 టికెట్లు క్యూలైన్లో సైతం గంటన్నరకు పైగా సమయం పడుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాణిపాకం దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు
దుర్గమ్మకు కాణిపాకం దేవస్థానం నుంచి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈవో పెంచల కిశోర్, స్థానాచార్యులు ఫణీంద్రస్వామిలతో పాటు ఎమ్మెల్యే కె. మురళీమోహన్ పట్టువస్త్రాలతో దుర్గగుడికి విచ్చేశారు. అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
90 వేల మంది దర్శనం..
మహాలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మను శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు సుమారు 90 వేల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 5వ రోజు దేవస్థానానికి రూ. 28.21లక్షల మేర ఆదాయం సమకూరిందని చెప్పారు. లడ్డూల ప్రసాదం విక్రయం ద్వారా రూ. 2.86లక్షలు, ఆరు లడ్డూ బాక్స్ ప్యాక్ విక్రయం ద్వారా రూ. 23.58లక్షలు, ఆర్జిత సేవా టికెట్లు, తలనీలాల టికెట్ల విక్రయం ద్వారా 1.75 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. ఇక అమ్మవారి అన్న ప్రసాదాన్ని 23,656 మందికి పంపిణీ చేసినట్లు వివరించారు.
ఉత్సాహం.. ఆనందం..
సాయం సంధ్య వేళ ఆహ్లాదకర వాతావరణంలో ఆది దంపతులైన శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన నగరోత్సవం కనుల పండువగా సాగింది. మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద యాగశాలలో ఆదిదంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు. మహామండపం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాట నృత్యాలు, డప్పు కళాకారులు విన్యాసాలతో నగరోత్సవం ముందుకు సాగింది. అమ్మవారిని దర్శించుకుని కొండ దిగువకు చేరుకున్న భక్తులు ఆదిదంపతుల నగరోత్సవంలో పాల్గొని తరించారు.
మహాలక్ష్మీ సేవలో గవర్నర్లు
మహాలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి విడివిడిగా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్కు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ సాదరంగా స్వాగతం పలకగా, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. వేద ఆశీర్వచనం, అమ్మవారి ప్రసాదాలు, పట్టువస్త్రాలు, చిత్రపటాన్ని గవర్నర్కు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్కమిషనర్ రాజశేఖరబాబు, జేసీ ఎస్.ఇలక్కియ పాల్గొన్నారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దంపతులకు ఈవో స్వాగతం పలుకగా.. అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి ఆయనతో పాటు ఉన్నారు.
ఇంద్రకీలాద్రిపై నేడు
● తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అమ్మవారి దర్శనం
● ఉదయం ఆరు గంటలకు
ప్రత్యేక ఖడ్గమాలార్చన(ఆరో అంతస్తు)
● ఉదయం 7 గంటలకు
ప్రత్యేక కుంకుమార్చన(ఆరో అంతస్తు)
● ఉదయం 9 గంటలకు
ప్రత్యేక చండీయాగం(యాగశాల)
● ఉదయం 9 గంటలకు ప్రత్యేక
శ్రీచక్రనవార్చన(లక్ష కుంకుమార్చన వేదిక)
● సాయంత్రం 5 గంటలకు
శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి
నగరోత్సవ సేవ
● సాయంత్రం 5 గంటలకు మహా మండపం ఆరో అంతస్తులో అర్చక సత్కార సభ
● సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి మహా నివేదన, పంచహారతుల సేవ,
వేద స్వస్తి
● రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం
అమ్మవారి దర్శనం అనంతరం కిందికి వస్తున్న భక్తులు, (ఇన్సెట్లో) మహాలక్ష్మి అలంకరణలో దుర్గమ్మ