
లోక్ అదాలత్ ఇచ్చేది అంతిమ తీర్పే
సత్తెనపల్లి: లోక్ అదాలత్లో ఇచ్చేది అంతిమ తీర్పుగా భావన చేయాలని మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్ కుమార్ రెడ్డి సూచించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్లో సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) ఆధ్వర్యంలో సత్తెనపల్లి న్యాయస్థానాల పరిధిలో ఉన్న పోలీసు అధికారులతో జూలై 5వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన సెక్షన్లు, ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో ఉన్న కేసులు పరిష్కారమయ్యే విధంగా చూడాలని ఆయా ఎస్.హెచ్.వో లకు సూచనలు చేశారు. ముందు సత్తెనపల్లిలో ఉన్న న్యాయమూర్తులు, ఎస్.హెచ్.ఓ లతో గుంటూరు జిల్లా 2వ అదనపు జిల్లా జడ్జి నాగరాజు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార కమిటీ కార్యదర్శి, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) జియాఉద్దీన్లు వర్చువల్గా జాతీయ లోక్ అదాలత్ పై సమీక్ష చేశారు. అనంతరం స్థానిక న్యాయమూర్తులు స్వయంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో సత్తెనపల్లి ప్రధాన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) తౌషిద్ హుస్సేన్, మొదటి అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పి.ప్రియదర్శిని, రెండవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) జె. సుజన్ కుమార్, ఆయా పోలీసు స్టేషన్ల ఎస్.హెచ్.ఓ లు పాల్గొన్నారు.
సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి జాతీయ లోక్ అదాలత్పై ఎస్హెచ్ఓలతో సమీక్ష