
రెడ్బుక్ పోలీస్
గుంటూరు జిల్లాలో అడ్డగోలుగా పోలీసుల తీరు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెడ్బుక్ రాజ్యాంగం అమలులో గుంటూరు జిల్లా పోలీసులు రెండు ఆకులు ఎక్కువే చదివారు. మంత్రి లోకేష్ ఆదేశాలను అమలు చేయడమే విధిగా పెట్టుకుని పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీకి జిల్లాలో రోజురోజుకు మరింత ఆదరణ పెరుగుతుండటంతో పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనపై ఆంక్షలు విధించిన పోలీసులు.. దీన్ని అడ్డం పెట్టుకుని పార్టీలో చురుకుగా ఉండే నేతలకు నోటీసులు జారీ చేశారు. కేసులు నమోదు చేస్తూ వేధింపులకు దిగుతున్నారు.
తెరపైకి పాత అక్రమ కేసులు
ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మిర్చి రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా పెట్టిన అక్రమ కేసులను ఇప్పుడు తిరగతోడుతున్నారు. ఆ సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు నేతలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కావటి మనోహర్నాయుడు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పేర్ని నాని తదితరులపై బీఎన్ఎస్ 223, 189(2), 329(4), 292, 126(2), 195(1) రెడ్విత్ 190 బీఎన్ఎస్, 125 ఆర్పీఏ 1951 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలు ఆ పర్యటనకు రాని పేర్ని నాని పేరు కూడా అప్పట్లో నమోదు చేయడం విమర్శలకు దారితీసింది. తాజాగా ఆ కేసులో అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్నాయుడు, మోదుగుల వేణుగోపాలరెడ్డికి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.
మాజీ సీఎం కారు స్వాధీనం
తాజాగా సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో చీలి సింగయ్య మృతి చెందడంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన బుల్లెట్ ప్రూఫ్ కారును స్వాధీనం చేసుకుని నల్లపాడు స్టేషన్కు తరలించారు. ఈ కేసులో ప్రభుత్వ డ్రైవర్తోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పీఏ కె.నాగేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
నోటీసుల పేరిట బెదిరింపులు
వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కేసులు, నోటీసులు
విమర్శలకు దారి తీస్తున్న ఉన్నతాధికారుల వైఖరి
వైఎస్సార్సీపీకి ఆదరణ పెరగడంతో కూటమి సర్కార్ కుట్ర
పాలకుల మెప్పు పొందేందుకు పలువురు పోలీసులు తహతహ
పాత కేసులు తిరగతోడుతూ ఎప్పడికప్పుడు కొత్తగా నమోదు
అధికార పక్షమైతే ఓకే...
వైఎస్ జగన్ ఇంటిపైకి తాటికాయలు విసిరిన వారిని పిలిచి స్టేట్మెంట్ తీసుకుని పంపించేశారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిపైకి ఇలా విసిరినా.. కేస విషయంలోనే ఎంతో ఉదాసీనంగా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న కారణంగా సాక్షి కార్యాలయంపై అమరావతి జేఏసీ పేరుతో కొందరు మూకుమ్మడిగా వచ్చి విధ్వంసం సృష్టించినా ఇప్పటివరకూ కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడంలో గుంటూరు పోలీసులు ముందుంటున్నారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులు చూపిస్తున్న ఉత్సాహంపై పోలీసుల పట్ల ప్రజల్లో ఉండే నమ్మకం సడలిపోయేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డితోపాటు పలువురు వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. పర్యటన ముందు కూడా నోటీసులు ఇచ్చి కార్యక్రమానికి వెళ్లవద్దంటూ బెదిరింపులకు గురిచేశారు. పాత గుంటూరు ప్రాంతానికి చెందిన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, స్వర్ణలత, పార్టీ మహిళా విభాగం నేత గనిక ఝాన్సీలకు ర్యాలీకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ ముందుగానే నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు ఇస్తామని భయపెట్టిన నేపథ్యంలో ఝాన్సీ, స్వర్ణ ర్యాలీకి వెళ్లలేదు. అయినప్పటికీ పాత గుంటూరులో వీరిద్దరూ ర్యాలీకి వెళ్లినట్లు కేసు నమోదు చేసినట్లు సమాచారం.