నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): ఈ నెల 26న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు నగరంలో పర్యటించే మార్గాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగరపాలక సంస్థ నుంచి తగిన ఏర్పాట్లు చేయాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం ఆ రోజు నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యానగర్, రింగ్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో నగరపాలక సంస్థ అధికారులతో కలిసి మేయర్ పర్యటించారు.
నగరపాలక సంస్థ, పోలీస్ విభాగాలు సమన్వయంతో ఎటువంటి సమస్యల తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. మంగళవారం ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్ నుంచి జేకేసీ కాలేజీ రోడ్ వైపుగా గుజ్జనగుండ్ల సెంటర్, రింగ్ రోడ్, విద్యానగర్ మెయిన్ రోడ్ వరకు ఏఎస్పీ రమణ మూర్తి, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్లతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు.
వాగులో లారీ బోల్తా
ప్రత్తిపాడు: వాగులో లారీ బోల్తా పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమద్రాసు రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు నుంచి గుంటూరు వైపు ధనియాల లోడుతో వెళుతున్న లారీ మంగళవారం రాత్రి ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం లోలెవల్ చప్టా సమీపంలో కొండవాగులో బోల్తా పడింది. చప్టా ఇరుకుగా ఉండటం, ముందు వెనుకలు ఎలాంటి సైన్బోర్డులూ లేకపోవడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి మార్జిన్లు అర్థం కాక లారీ వాగులో బోల్తా పడినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.
ఆలయ నిర్మాణానికి విరాళం
నరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణానికి నరసరావుపేటకు చెందిన వేమ వెంకటేశ్వరరావు, నాగ రజిని దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. ఆలయ ఈవో నలబోతు మాధవిదేవిని మంగళవారం ఆలయ కార్యాలయంలో కలిసిన దాతలు విరాళం మొత్తాన్ని అందించారు. ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని ఈ సందర్భంగా ఈవో కోరారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొత్తలంక కార్తికేయ శర్మ, నండూరి కాళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో చండీహోమం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు బృందావన్గార్డెన్స్లోని వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించా రు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ హోమం చేపట్టారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులతో తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణా హుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్.మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం.

సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలన