
ఇళ్లు కట్టిస్తానని మోసగించిన వ్యక్తి అరెస్టు
తెనాలి రూరల్: పేదలకు ఇళ్లు కట్టిస్తానని మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు‘ పథకంలో భాగంగా తెనాలి మండలంలోని పెదరావూరు, బుర్రిపాలెం, నేలపాడు గ్రామాలలో పలువురికి స్థలాలను మంజూరు చేశారు. అప్పటి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పట్టాలు అందజేశారు. లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రూ. 1.80 లక్షలు మంజూరు చేశారు. ఆ క్రమంలో ఎస్జీ బిల్డింగ్ వర్క్స్ పేరిట పట్టణ మారీసుపేట 24వ వార్డు శాంతినగర్కి చెందిన కాంట్రాక్టర్ కం ఏజెంట్ ఎం. పున్నారావు తెరపైకి వచ్చాడు. తాను తక్కువ ఖర్చుతో సకాలంలో ఇళ్లు కట్టిస్తానని సుమారు 175 మంది లబ్ధిదారులను నమ్మించాడు. వారి నుంచి అటు ప్రభుత్వం ఇచ్చిన నగదు, ఇటు లబ్ధిదారుల సొంత డబ్బు అందినకాడికి దండుకుని కొద్దిపాటి పనులు మాత్రమే చేశాడు. లబ్ధిదారులను ఇన్నాళ్లు ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చాడు. బాధితుల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 58 మంది బాధితులను విచారించి మంగళవారం పున్నారావును అరెస్ట్ చేశామని రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ తెలిపారు. ఇదే తరహాలో పేదలను మోసం చేసిన మరో ఏడుగురు కాంట్రాక్టర్లపై త్వరలో చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.