● బైక్పై ఉన్న వ్యక్తి కృష్ణానదిలో పడిన వైనం ● కాలు, చేయి విరగడంతోపాటు తీవ్రగాయాలు ● పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం
తాడేపల్లి రూరల్: జాతీయ రహదారిపైనున్న కృష్ణానది కనకదుర్గ వారధిపై గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో ఓ లారీ మంగళవారం రాత్రి అదుపుతప్పి ముందు వెళుతున్న బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి వారధిపై నుంచి కృష్ణానది ఇసుక తిన్నెల్లో పడ్డాడు. లారీ రెయిలింగ్ను ఢీకొని ఎదురు క్యాబిన్ వరకూ వారధిపైనుంచి గాలిలో వేలాడింది. సేకరించి వివరాల ప్రకారం.. చైన్నె నుంచి కోలకత్తా వెళుతున్న లారీ కనకదుర్గ వారధి వద్దకు వచ్చాక బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు బైక్పై వెళుతున్న తాజ్ అనే వ్యక్తిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తాజ్ గాలిలో ఎగిరి 60 అడుగుల లోతులో ఉన్న కృష్ణానది ఇసుక దిన్నెల్లో పడిపోయాడు. లారీ నడుపుతున్న ఎంపీకి చెందిన మోసిన్ లారీ క్యాబిన్ డోర్ ఓపెన్ అయి వారధిపై పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ వీరేంద్ర సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన డ్రైవర్ను చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. రోప్ సహాయంతో పై నుంచి కిందకు దిగి ఎస్ఐ నారాయణ, సిబ్బంది కలిసి ఇసుక తిన్నెల్లో పడిన తాజ్ను కిలోమీటర్ మేర మోసుకొచ్చి వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి కాలు, చేయి విరగడంతోపాటు తీవ్రగాయాలు అయ్యాయి. ఇతను ఉత్తర్ప్రదేశ్ నుంచి వచ్చి విజయవాడలో ఉంటున్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన లారీని రెండు గంటలపాటు కష్టపడి క్రేన్ సహాయంతో పోలీసులు తొలగించారు. వారధిపై ప్రమాదం జరగడంతో సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
కనకదుర్గ వారధిపై బైకును ఢీకొన్న లారీ
కనకదుర్గ వారధిపై బైకును ఢీకొన్న లారీ