
బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలు పెంచుతాం
బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలను పెంచి కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులకు ఆదేశించారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై మార్క్ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులు, ఎంపీడీవోలు మండల స్థాయి అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్లాక్ బర్లీ పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. సీఎం యాప్లో రైతుల పేర్ల నమోదు వేగంగా చేపట్టాలన్నారు. జిల్లాలో మూడు కేంద్రాలలో బ్లాక్ బర్లీ కొనుగోలు కొనసాగుతుందని, వీటిని ఎనిమిది కేంద్రాలకు విస్తరించాలని అందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ మార్క్ఫెడ్ ఏడీని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 30 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు జరుగుతుందని, దీనిని 50 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు ప్రతిపాదన తయారు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం యాప్లో ఇంకొల్లు, యద్దనపూడి, మార్టూరుకు చెందిన రైతులు సుమారు 3000 మంది రిజిస్టర్ అయ్యారని, వీరి కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని మ్యాపింగ్ చేయాలన్నారు. జిల్లాలో సుమారు 13 వేల మంది పొగాకు రైతులు ఉన్నారని, సీఎం యాప్లో 7, 270 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, యాప్లో నమోదైన రైతులకు తేదీలు కేటాయించినట్లు తెలిపారు.