వైఎస్సార్‌సీపీ ‘పశ్చిమ’ సమన్వయకర్తగా అంబటి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ‘పశ్చిమ’ సమన్వయకర్తగా అంబటి

Jun 25 2025 6:58 AM | Updated on Jun 25 2025 11:29 AM

పట్నంబజారు (గుంటూరుఈస్ట్‌) : వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా అంబటి రాంబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే అంబటి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వై.ఎస్‌.జగన్‌ సత్తెనపల్లి సీటు ఇవ్వడంతో ఆయన అక్కడ విజయం సాధించారు. కేబినెట్‌లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా అంబటి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత జిల్లా అధ్యక్షులుగా నియమితులైనప్పటి నుంచి అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమాల్లో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు.

ఖతార్‌లో ఉద్యోగావకాశాలు

గుంటూరు వెస్ట్‌/గుంటూరు ఎడ్యుకేషన్‌: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఖతార్‌ దేశంలో టీఐసీ అండ్‌ ఏ, ఆర్‌సీ మల్టీ వెల్డర్‌ సర్వీసుల కింద ఉద్యోగం చేయాలనుకునే పురుష అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలను కల్పిస్తోందని గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, ఐటీసీ విద్యార్హతలతో 24 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు, సంబంధిత వృత్తి నైపుణ్యంలో నాలుగేళ్ల కనీస అనుభవం ఉండాలని తెలిపారు. 

టీఐజీ అండ్‌ ఏఆర్‌సీ మల్టీ వెల్డర్‌కు వేతనం నెలకు రూ.51,939 నుంచి, టీఐజీ అండ్‌ ఏఆర్‌సీ వెల్డర్‌కు రూ.42,478 నుంచి ఉంటుందని వివరించారు. కనీసం రెండేళ్లు అక్కడ పనిచేయాల్సి ఉంటుందనానరు. సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాల ఆధారంగా ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత వసతి, భోజన, వైద్య, రవాణా సదుపాయాలతో కూడిన ఈ ఉద్యోగావకాశాల కోసంఅభ్యర్థులు ఈ నెల 25లోపు 99888 53335, 87126 55686 ఫోను నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

27న నిధి ఆప్‌కే నికత్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరులోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌) ప్రాంతీయ కార్యాలయ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన నిధి ఆప్‌కే నికత్‌ కార్యక్రమాన్ని ఆరు జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ ఎస్‌.తానయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఉదయం 9.30 గంటల నుంచి జరగనున్న సమావేశాల్లో యజమానులు, ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు ఇతర వాటాదారులు, లబ్ధిదారులతో పరస్పరం ముఖాముఖిగా చర్చలు జరుగుతాయని తెలిపారు. 

గుంటూరులోని ఏసీ కళాశాల, కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరులోని దీపక్‌ నెక్ట్స్‌జెన్‌ ఫీడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎల్‌ఆర్‌ పురంలో సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ మెటలి ఫెరస్‌ మైన్స్‌ గ్రూప్‌లోని ప్రకాశం వృత్తి శిక్షణ కేంద్రం, విజయవాడలో ఏలూరు రోడ్డు సీతారాంపురంలోని విజన్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ, పల్నాడు జిల్లా గణపవరంలోని శ్రీధనలక్ష్మి కాటన్‌ అండ్‌ రైస్‌ మిల్లు, బాపట్ల వ్యవసాయ కళాశాలలో కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.

గుంటూరు కాపు హాస్టల్‌లో ప్రవేశాలకు ప్రకటన

గుంటూరు రూరల్‌: నగర శివారు గోరంట్ల గ్రామం హోసన్నా మందిరం వెనుక ఉన్న కాపు విద్యార్థి వసతి గృహంలో అడ్మిషన్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలగ అభ్యుదయ సంఘం కార్యదర్శి బాలిశెట్టి విజయ్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. వసతి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, దూరప్రాంతాలకు చెందిన కాపు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, పోటీ పరీక్షలు రాసేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు ఫోను నంబర్లు 85208 71568, 86865 55999 లలో సంప్రదించాలన్నారు. సమావేశంలో పూరిబండి శ్రీకాంత్‌, డేగల వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ ‘పశ్చిమ’ సమన్వయకర్తగా అంబటి 1
1/1

వైఎస్సార్‌సీపీ ‘పశ్చిమ’ సమన్వయకర్తగా అంబటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement