
ఉత్సాహంగా వేసవి విజ్ఞాన శిబిరం
గుంటూరు ఎడ్యుకేషన్: అరండల్పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా నిర్వహించిన శిక్షణా తరగతుల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉప గ్రంథ పాలకురాలు కె.ఝాన్సీలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థులకు కథలు చదవటం, కథలు వినడం, మ్యాథ్స్ క్లాస్, స్పోకెన్ ఇంగ్లీష్, దేశభక్తి గీతాల పోటీలను నిర్వహించారు. ఈసందర్భంగా ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు రోజూ గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం, గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, పెయింటింగ్, పప్పెట్ మేకింగ్, పేపర్ క్రాఫ్ట్ నేర్చుకోవాలని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా గ్రంథాలయాల్లో నిర్వహించే శిక్షణా కార్యక్రమాలకు పంపాలని సూచించారు. గ్రంథ పాలకులు కె.చిన్నపరెడ్డి, ఎన్.నాగిరెడ్డి, శాంతి భాయి, వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు
గుంటూరు నర్సింగ్ కాలేజ్లో ఉచిత శిక్షణ
గుటూరు మెడికల్: నర్సింగ్ సిబ్బంది గతంలో జర్మనీ వెళ్లాలంటే ఏం చేయాలో, ఎక్కడ శిక్షణ తీసుకోవాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక చాలామంది ఇబ్బంది పడేవారు. రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇప్పించి జర్మనీలో ఉద్యోగాలు పొందేలా ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. నర్సులకు శిక్షణ ఇవ్వడానికి ఒక ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను శిక్షణ కేంద్రంగా ఎంపిక చేశారు. రాత, మౌఖిక పరీక్షల ద్వారా కోస్తాంధ్ర ప్రాంతం నుంచి 22 మందిని ఎంపిక చేశారు. గత ఏడాది డిసెంబర్ 11 నుంచి శిక్షణ ప్రారంభమైంది. శిక్షణలో జర్మన్ భాషలో ఏ1, ఏ2, బీ1, బీ2 స్థాయిలలో నైపుణ్యం సాధించాలి. ఇప్పటికే ఏ1, ఏ2, బీ1 పరీక్షలు పూర్తికాగా.. వారికి చైన్నెలో బీ2 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్న్ లో మౌఖిక పరీక్ష ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధిస్తే జర్మనీలో ఉద్యోగానికి ఎంపికై నట్లు లెక్క. అలా ఎంపికై నా వారికి విమాన టికెట్లు, వీసా, ధ్రువపత్రాలు అన్నీ ఉచితంగా అందిస్తారు. వీరికి నెలకు రూ.2.7 లక్షల నుంచి రూ.3.2 లక్షల వరకు జీతం ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని జర్మనీ పంపేందుకు ఏర్పాట్లు చేయడం ఆనందంగా ఉందని గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో శిక్షణ తీసుకుంటున్నవారు చెబుతున్నారు. విదేశాల్లో నర్సులుగా ఉద్యోగాల కోసం వెళ్లేందుకు ఇది సువర్ణ అవకాశం అంటున్నారు.
కల్లంలోని మిర్చి చోరీ
సుమారుగా 15 క్వింటాళ్ల మిర్చి మాయం
మేడికొండూరు: రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట దిగుబడులను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లిన ఘటన మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. వెలనాటి శ్రీనివాసరావు అనే రైతు తన పొలంలో సుమారు 40 క్వింటాళ్ల మిరప పంటను కోసి కల్లాల్లో ఆరబోశాడు. ఎండిన మిర్చిని టిక్కీలలో నింపేందుకు ఒక రాశిగా చేశాడు. బుధవారం రాత్రి మిర్చి రాశిలోని సుమారు 15 క్వింటాళ్ల కాయలు దొంగలు టిక్కీలలో నింపుకొని వెళ్లినట్లు రైతు శ్రీనివాసరావు తెలిపారు. మిర్చి దొంగతనంపై మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రైతు తెలిపారు. గతంలో ఇదే తరహాలో మండలంలోని డోకిపర్రు గ్రామంలో కల్లాల్లో ఉన్న మిర్చి దొంగతనం జరిగిందని రైతు తెలిపాడు. ఇప్పటికై నా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి మిర్చి దొంగలను నియంత్రించాలని మండల రైతులు కోరుతున్నారు.
గిరిజన పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం
వినుకొండ: స్థానిక వినుకొండ పట్టణంలోని హనుమాన్నగర్లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాల (బాలుర) నందు 2025–26 విద్యాసంవత్సరానికి తరగతుల్లో ఖాళీలకు దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వై. శివరామకృష్ణ తెలిపారు. 5వ తరగతిలో ఎస్టీ–30, ఎస్సీ–5, బీసీ–2, ఓసీ–1, పీహెచ్సీ–1, గిరిజన ప్రాంతీయ ఉద్యోగులు –1, బ్యాక్ లాగ్ పోస్టులు (ఎస్టీ విద్యార్థులకు మాత్రమే), 6వ తరగతిలో 21, 8వ తరగతిలో 6, 9వ తరగతిలో 9 కలవు. పూర్తి చేసిన దరఖాస్తులను మే నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పాఠశాల కార్యాలయంలో అందజేయాలన్నారు.

ఉత్సాహంగా వేసవి విజ్ఞాన శిబిరం