‘వెన్నుపోటు దినం‘ విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘వెన్నుపోటు దినం‘ విజయవంతం చేయాలి

Jun 2 2025 10:36 AM | Updated on Jun 2 2025 10:46 AM

‘వెన్నుపోటు దినం‘ విజయవంతం చేయాలి

‘వెన్నుపోటు దినం‘ విజయవంతం చేయాలి

4న పొన్నూరులో నిరసన కార్యక్రమం

తరలిరావాలని పిలుపునిచ్చిన నేతలు

పొన్నూరు: అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసగించిన కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు జూన్‌ 4న నిర్వహించనున్న ’వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్‌లు పిలుపునిచ్చారు. 

ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, తాడికొండ, గుంటూరు తూర్పు, మంగళగిరి, ప్రత్తిపాడు నియోజకవర్గాల సమన్వయకర్తలు వనమా బాల వజ్రబాబు, షేక్‌ నూరి ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, బలసాని కిరణ్‌కుమార్‌లతో కలిసి నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సభకు పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. తొలుత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

హామీలు నెరవేర్చని చంద్రబాబు
అనంతరం అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ప్రజలు ఇప్పటికే చంద్రబాబుకు ఓటెందుకు వేశామా అనే ఆలోచనలో పడ్డారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలు గుర్తెరిగి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి డీబీటీ రూపంలో నేరుగా ప్రజల ఖాతాల్లో నగదు జమ చేసి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. చంద్రబాబు అంటే మోసం, దగా, వెన్నుపోటు, అబద్ధాలే గుర్తుకు వస్తాయన్నారు. 

ఎన్నికల ముందు చదువుకునే ప్రతి ఒక్కరికీ తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఏడాదికి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఒక్క హామీ అరకొరగా ఇచ్చి అన్నీ ఇచ్చినట్లు ప్రచారం చేయడంలో దిట్ట చంద్రబాబని విమర్శించారు. పైగా వలంటీర్లు, రేషన్‌ వాహనాల డ్రైవర్లు, సిబ్బంది ఉద్యోగాలను తొలగించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రతి ఒక్కరూ రాసుకుంటున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు దుష్టపాలనకు నిరసనగా ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న వెన్నుపోటు దినాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు పొన్నూరులో కూడా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తామన్నారు. ర్యాలీలు చేపట్టి, అధికారులకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

అన్నివర్గాలకు అన్యాయం
పార్టీ గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్‌ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాదికే కూటమి ప్రభుత్వం ప్రజలతో ఛీ అనిపించుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి మోసం చేశారని అన్నారు. సంక్షేమాన్ని అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గతంలో ఉన్న విద్యావ్యవస్థలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమూల మార్పులు తీసుకువచ్చి ఆ రంగాన్ని అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ విద్యార్థులకు టాబ్‌లు ఇస్తే చెడిపోతారని చెప్పడం దుర్మార్గం అన్నారు. సంపద సృష్టిస్తా, పేదలను ధనవంతులుగా చేస్తా, అభివృద్ధిని అందలం ఎక్కిస్తానంటూ కాకమ్మ కబుర్లు చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారని దుయ్యబట్టారు. 

నవంబరు నుంచి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యకర్తలకు లబ్ధితోపాటు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. వ్యవస్థలో ఎలాంటి మార్పు తీసుకురావాలన్నా అది వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. ఆయనను మళ్లీ సీఎం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం వెన్నుపోటు దినం కరపత్రాలను ఆవిష్కరించారు. మైనారిటీ కమిషన్‌ సభ్యులు షేక్‌ సైఫుల్లా, ఎంపీపీ భవనం పద్మలీల, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నల్లమోతు రూత్‌ రాణి, నియోజకవర్గ నాయకులు ఆకుల వెంకటేశ్వరరావు, అంబటి వెంకటేశ్వరరావు, షేక్‌ నాజర్‌, బొనిగల వేణుప్రసాద్‌, చింతలపూడి మురళీకృష్ణ, ఎందేటి వెంకట సుబ్బయ్య, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement