
మళ్లీ రేషన్ కష్టాలు
గుంటూరు వెస్ట్: రేషన్ సరుకుల పంపిణీ తొలిరోజు దారుణంగా విఫలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎండీయూ వాహనాలను కాదని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ ప్రారంభించింది. దీని కోసం నాయకులతోపాటు కార్యకర్తలను దుకాణాలకు పంపి హడావుడి చేసింది. ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. చాలా చోట్ల ఈ –పోస్ మిషన్లు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గళ్ళా మాధవి స్థానిక ఏటీ అగ్రహారంలో నెంబర్ 0781174 రేషన్ దుకాణాన్ని ప్రారంభించారు. కొద్ది సేపటికే అక్కడ ఈ –పోస్ మిషన్ మొరాయించింది. జిల్లాలో మొత్తం 972 రేషన్ దుకాణాలున్నాయి. 5,99,511 మందికి సుమారు 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. తొలి రోజు పెద్దగా స్పందన లేదు. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసేటప్పుడు పేదలకు ఎంతో సౌలభ్యంగా ఉండేది. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని కార్డుదారులు వాపోతున్నారు.
తప్పని సమస్యలు
చాలా దుకాణాల్లో సర్వర్ మొరాయించింది. కొన్ని చోట్ల నెమ్మదించింది. ఈ పోస్ మిషన్లు, వేయింగ్ మిషన్లు చాలా వరకు పాడైపోయాయి. కొన్ని చోట్ల లైన్లు కనబడగా, మరికొన్ని చోట్ల ఎవ్వరూ రాలేదు. మిషన్లు పనిచేయకపోవడంతో ప్రజలు తిరిగి వెళ్లిపోయారు.
తొలిరోజు సరుకుల
పంపిణీలో తీవ్ర ఇబ్బందులు
పలుచోట్ల ఈ– పోస్ మిషన్లు
మొరాయింపుతో సమస్యలు
ఎమ్మెల్యే మాధవి ప్రారంభించిన దుకాణంలోనూ పనిచేయని వైనం
ఇంటి వద్దకే సరుకులు ఇచ్చే వ్యవస్థను
నాశనం చేసిన కూటమి ప్రభుత్వం
పాలకుల తీరుపై ప్రజల తీవ్ర ఆగ్రహం

మళ్లీ రేషన్ కష్టాలు