
పకడ్బందీగా మెగా డీఎస్సీ
● పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు, బందోబస్తు కల్పించండి ● సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్
నరసరావుపేట: జిల్లాలో నేటి నుంచి ఈ నెల 30 వరకు నిర్వహించే మెగా డీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష కేంద్రాల వద్ద మౌలికవసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. గురువారం కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రెండు షిఫ్ట్లలో సుమారుగా 18,415 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారన్నారు. మారుమూల ప్రాంతాలనుంచి అభ్యర్థులకు అనువుగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాలు తెలిసేలా ప్రధాన కూడళ్లలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డులు అనుమతించడం జరుగుతుందని, పరీక్షకు ఒక గంట ముందుగా అభ్యర్థులు హాజరుకావాలని, నిముషం లేటు అయినా అనుమతించడం జరగదని అన్నారు. అభ్యర్థులు కలర్ ఫొటో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డీఆర్ఓ ఏకా మురళి, అదనపు ఎస్పీ జేవీ సంతోష్, ఆర్డీఓ కె.మధులత, డీఈఓ ఎల్.చంద్రకళ, ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.
8న రెడ్ల సత్రం
సిల్వర్ జూబ్లీ వేడుకలు
నరసరావుపేట రూరల్: కోటప్పకొండలోని శ్రీ యోగి వేమారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్, రెడ్ల సత్రం ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈనెల 8వ తేదీ ఉదయం 11గంటలకు నిర్వహిస్తున్నట్టు సత్రం కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డి, మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి, గాదె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్రెడ్డి, యర్రం వెంకటేశ్వరరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీజీ కృష్ణారెడ్డి, సత్తెనపల్లి వైఎస్సార్ సీపీ కన్వీనర్ డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డిలు పాల్గొంటారని తెలిపారు.
ఘనంగా రామాలయం వార్షిక వేడుకలు
నకరికల్లు: శ్రీరాంపురంలోని శ్రీరాముల వారి ఆలయ వార్షిక వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. 21వ వార్షిక వేడుకలు పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
24 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 24 మందికి గురువారం గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించి సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ ప్రక్రియలో మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుచిత్ర, డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్లు నాగూర్ షరీఫ్, గోపవరపు స్టాన్లీ రాజ్కుమార్, సీనియర్అసిస్టెంట్ బి.శ్యామ్ అనిల్, పాల్గొన్నారు.
జూలై 26, 27 తేదీలలో టైప్రైటింగ్ పరీక్షలు
రేపల్లె: స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మంగళగిరి వారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషలలో టైప్రైటింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ టైప్రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సీవీ మోహనరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 26, 27 తేదీలలో లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలను, అదనంగా ఇంగ్లిష్ జూనియర్ గ్రేడ్ పరీక్షలు 36 కేంద్రాలలో నిర్వహించనున్నట్టు తెలిపారు. జులై 12, 13 తేదీలలో తెలుగు, ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్ అన్ని గ్రేడ్ల పరీక్షలు 7 కేంద్రాలలో నిర్వహిస్తారు.

పకడ్బందీగా మెగా డీఎస్సీ