ధైర్యే సాహసే విజయం | - | Sakshi
Sakshi News home page

ధైర్యే సాహసే విజయం

May 1 2025 1:53 AM | Updated on May 1 2025 1:53 AM

ధైర్యే సాహసే విజయం

ధైర్యే సాహసే విజయం

జీవితం చాలా పెద్దది. అందులో మనం రాసే పరీక్ష ఎంతో చిన్నది. కేవలం ఒక్క పరిక్షకే ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే పిరికితనం.సాధించాలన్న తపనతో జీవిత పరీక్ష నెగ్గాలి. నవమాసాలు మోసిన కన్నతల్లి.. బరువు బాధ్యత నెత్తికెత్తుకున్న తండ్రి గుండెలు పగిలి.. జీవితాంతం హృదయ భారాన్ని మోసేలా.. తనువు చాలించడం బాధాకరం. సాధించాలన్న తపన ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొనే మనోబలాన్ని ఇస్తుంది. తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిలైనా జీవితం ముగిసి పోదు. క్షణికావేశ నిర్ణయాలు మంచిది కాదు. నిరాశ చెందకుండా మరింత పట్టుదలతో ముందుకు సాగితే విజయం మన సొంతమవుతుంది.
● మనోవ్యధతో రాలుతున్న విద్యా కుసుమాలు ● ఫెయిల్‌ అయింది పరీక్షే.. జీవితం కాదు ● విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోకూడదు ● తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంతో అవసరం

పట్నంబజారు: మిస్సైల్‌ రంగంలో భారతదేశ రూపురేఖలు తీర్చిదిద్దిన భారతరత్న అబ్దుల్‌ కలాం పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చేవి. అయినా పట్టుదలతో ముందడుగు వేయడంలో ఆయను గొప్ప శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఖ్యాతి చెందారు. భారతరత్నగా నిలిచారు. క్రికెట్‌ ప్రపంచంలో కీర్తించే సచిన్‌ టెండూల్కర్‌ పదో తరగతి తప్పిన విషయం స్వయంగా ఆయన చెప్పాడు. ఎంతో మంది విద్యావేత్తలు, గొప్ప వ్యక్తులు పరీక్షల్లో ఫెయిల్‌ అయిన తరువాతే.. జీవిత పరీక్షలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు.

తల్లిదండ్రులకు కడుపుకోత

పరీక్ష ఫెయిల్‌ అయ్యామని, అర్ధంతరంగా, క్షణికావేశంలో విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకొని బతుకుతున్న తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిల్చిన పరిస్థితులు ఎంతో బాధాకరం. ఒక్కటంటే ఒక్క నిమిషం మనసు నిబ్బరంగా చేసుకొని ప్రశాంతంగా ముందున్న భవిష్యత్తు, తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది కాదు.

● కొద్ది రోజుల కిందట ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. దుగ్గిరాల మండలం చినపాలెంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసిన చెన్ను అవినాష్‌, రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాననే బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

● గుంటూరు లాలాపేటకు చెందిన కె. అభినవ్‌ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని, మనస్తాపంతో ఎవరికి చెప్పకుండా తాడేపల్లి రైల్వేస్టేషన్‌ దగ్గరకు వెళ్లాడు. సెల్‌టవర్‌ ఆధారంగా పోలీసులు విద్యార్థిని గుర్తించి రక్షించారు.

● నగరంలో తూర్పు నియోజకవర్గ పరిధిలో కూడా ఓ విద్యార్థిని కూడా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో ఆత్మహత్యయత్నం చేసే ప్రయత్నం చేసింది. దీనిని గమనించిన తల్లితండ్రులు కాపాడి, విషయం బయటకు పొక్కకుండా చూసుకోవడంతో ఎటువంటి కేసు నమోదు కాలేదు.

ముందు ఎంతో జీవితం

పరీక్షలు రాసే ప్రతి విద్యార్థి ఇదే ఆఖరిది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. పాస్‌, ఫెయిల్‌ అనేవి జీవితంలో అత్యంత సర్వసాధారణమైన విషయంగా భావించాలి. ఏ తప్పు వల్ల ఫెయిల్‌ అయ్యామనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. ఇకపై ఆ తప్పు జరగకుండా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. ఒత్తిడి నుంచి వేగంగా బయటపడేందుకు ప్రయ త్నించాలి. వెనకబడిన పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఉపాధ్యాయులు, సీనియర్లు, తల్లిదండ్రుల సలహాలు తీసుకుని ముందుకు సాగాలి.

తల్లిదండ్రులే ధైర్యం చెప్పాలి

లక్షలాది రూపాయలు పెట్టి చదివించాం.. ఫెయిల్‌ అయ్యాడనే భావనంతో కాకుండా.. పరిక్షల్లో తప్పిన విద్యార్ధులను తల్లిదండ్రులు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు సైతం ఎంతో ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితిని అర్థం చేసుకోవాలి. చిరునవ్వుతో సప్లమెంటరీ రాద్దాంలే అని చెప్పే మాట ఎంతో మనోధైర్యాన్ని కల్పిస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫెయిల్‌ అయిన విద్యార్థులు ముభావంగా ఉన్నా, పరధ్యానంలో ఉన్నా వారిని ఒంటరిగా వదలిపెట్టొద్దు. ఫెయిల్‌ అవ్వడం వల్ల నష్టం లేదని ధైర్యాన్ని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement