ముక్తి మార్గం... ఒక ఆధ్యాత్మిక ప్రయాణం | Spiritual connection means attachment with the soul following the path of Truth | Sakshi
Sakshi News home page

ముక్తి మార్గం... ఒక ఆధ్యాత్మిక ప్రయాణం

May 4 2026 5:56 AM | Updated on May 4 2026 5:56 AM

Spiritual connection means attachment with the soul following the path of Truth

మంచి మాట

సాధారణంగా మనిషి తనను తాను శరీరం, పేరు, కులంతో గుర్తుంచుకుంటాడు. దీనివల్ల రాగద్వేషాలు, భయం, దుఃఖం కలుగుతాయి. ముక్తి అనేది కేవలం మరణానంతరం లభించేది కాదు, జీవించి ఉండగానే పొందే స్థితి (జీవన్ముక్తి). వైరాగ్యం– లౌకిక విషయాల పట్ల మోహం తగ్గించుకోవడం.  ఎల్లప్పుడూ సత్య మార్గంలో నడవడం.  ఇతరులకు హాని చేయకుండా జీవించడం. సరైన దిశానిర్దేశం చేసే గురువును ఆశ్రయించడం.  ముక్తి అంటే ఎక్కడికో వెళ్లడం కాదు, మనలోని దైవత్వాన్ని మనం గుర్తించడం. మన ప్రవృత్తికి ఏ మార్గం సరిపోతుందో దానిని ఎంచుకుని సాగడమే ముక్తికి అసలైన బాట.

ముక్తి లేదా మోక్షం అంటే పునర్జన్మ లేని స్థితిని పొందడం. దేహం ముసలిదవుతుంది, మనస్సు మారుతుంటుంది, కానీ వీటన్నింటినీ గమనిస్తున్న ‘సాక్షి’ ఒకరు ఉన్నారు. ఆ సాక్షి లేదా ఆ చైతన్యమే అసలైన దైవత్వం. దైవత్వానికి., మనకు మధ్య ఉన్న అతిపెద్ద అడ్డుగోడ ‘అహం’   ‘నేను చేస్తున్నాను’, ‘ఇది నాది’ అనే భావన తగ్గినప్పుడు, మనలోని అనంతమైన దైవశక్తి వెలుగులోకి వస్తుంది.   

సముద్రంలోని అల నేను సముద్రాన్ని కాదని భావిస్తే అది అహంకారం, తాను సముద్రంలో భాగమే అని గుర్తిస్తే అది జ్ఞానం. గంగా, యమునా వంటి నదులు వేర్వేరుగా ప్రవహించినా, సముద్రంలో కలిసిన తర్వాత అవి సముద్రమే అయిపోతాయి. అలాగే జీవులన్నీ వేర్వేరుగా కనిపించినా, వాటి మూలం ఆ పరమాత్మే. మట్టితో చేసిన కుండ, ప్రమిద, బొమ్మలు.. పేర్లు వేరైనా వాటన్నింటిలో ఉన్న అసలు వస్తువు మట్టే. అలాగే జగత్తులోని రూపాలు వేరైనా, అంతటా ఉన్నది పరబ్రహ్మమే. ‘నేను ఎవరు?’ అనే ప్రశ్నతో మొదలై, దేహం అనిత్యమని, ఆత్మ శాశ్వతమని తెలుసుకోవడం. పరమాత్మపై పరిపూర్ణ మైన ప్రేమను, శరణాగతిని కలిగి ఉండటమే భక్తి మార్గం. కలియుగంలో ఇది అత్యంత సులభమైన మార్గంగా చెప్పబడింది.  

‘దైవత్వాన్ని గుర్తించడం’ అనే మాట వినడానికి సరళంగా అనిపించినా, ఇది ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం. దీనిని సాకారం చేసుకోవడానికి మన గ్రంథాలు కొన్ని ఆచరణాత్మక మార్గాలను సూచించాయి. అదేమంటే... రమణ మహర్షి బోధించినట్లుగా ‘నేను ఎవరు?’ అనే విచారణ చేయడం. 

చెరువు నీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే అందులో చంద్రుని ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే దైవత్వం ప్రతిఫలిస్తుంది. షరతులు లేని ప్రేమను పెంపొందించుకోవడం ద్వారా దైవానికి దగ్గరవ్వవచ్చు. ‘తత్వమసి‘ అంటే ‘దైవం నీవే’. తత్వమసి అనేది కేవలం చదవడానికి వాక్యం కాదు, అది ఒక అనుభూతి. ‘నేను పరిమితమైన వాడిని’ అనే అజ్ఞానం నుంచి ‘నేను అనంతమైన వాడిని’ అనే జ్ఞానం వైపు నడిపించే మహా మంత్రం ఇది. ఈ సత్యాన్ని గ్రహించిన మనిషి జీవన్ముక్తుడు అవుతాడు.

మనం దైవాన్ని గుడులలో, గోపురాలలో వెతుకుతాము, కానీ అసలైన దేవుడు మన హృదయస్థానంలో ఉంటాడు. ప్రతిరోజూ కొంత సమయం నిశ్శబ్దంగా కూర్చుని, ఆలోచనలను గమనిస్తూ ఉంటే, ఆ నిశ్శబ్దంలోనే దైవత్వం అనుభవంలోకి వస్తుంది. బాహ్య ప్రపంచపు సందడిని తగ్గించి, అంతరంగంలోకి ప్రయాణించడమే దీనికి మార్గం. ‘అందరిలోనూ ఉన్నది ఒకే దైవం‘ అని గుర్తించడం. ఎదుటి వారిని చూసినప్పుడు వారి రూపం కంటే, వారిలో ఉన్న జీవాన్ని (దైవత్వాన్ని) గౌరవించడం నేర్చుకోవాలి. ‘అద్వైతం’ అంటే ఇదే. ఇది ఏదో ఒక రోజులో జరిగేది కాదు, ఇది నిరంతర ప్రక్రియ.

– ఆనంద ‘మైత్రేయ’మ్‌

Advertisement
 
Advertisement
Advertisement