ఘన వారసులు
ప్రశాంతమైన వాతావరణంలో ఆవిష్కృతమయ్యే దృశ్యం అది. ఆవు పాలు పిండడానికి యశోద ముందుకు రాగా, ఆమె వెనక పాల గ్లాసుతో తేజోవంతుడైన కృష్ణుడు కనిపిస్తాడు. 1890లలో చిత్రించిన జీవకళతో ఉట్టిపడే ఈ యశోదాకృష్ణుల చిత్రం మన దేశ ప్రసిద్ధ చిత్రకారులలో ఒకరైన రాజా రవివర్మ సృష్టి. కాన్వాస్పై తైలవర్ణ చిత్రంగా గీసిన ఈ చిత్రం ఇటీవల వేలం పాటలో రికార్డ్ స్థాయిలో అమ్ముడై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన ఆర్టిస్ట్ రుక్మిణి వర్మ రాజా రవి వర్మ మునిమనవరాలు. తాతగారి కళాఖండం రికార్డ్ స్థాయిలో అమ్ముడు కావడం ఆమెను ఆనంద సాగరంలో ముంచెత్తింది. ‘మా ముత్తాతగారి పనికి ఎంతో కాలంగా రావాల్సిన గుర్తింపు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇది నా జీవితంలో ఆనందకర సమయం. రవివర్మ సంతకం చేసిన, నిస్సందేహంగా ఆయనవే అని చెప్పబడే చిత్రాలు ఈరోజుల్లో వేలం పాటల్లో దొరకడం చాలా అరుదు’ అన్నారు రుక్మిణి వర్మ.
రవివర్మకు సంబంధించిన సంచలన కళాఖండాన్ని రుక్మిణి వర్మ స్వయంగా చూడనప్పటికీ ఆయన వేసిన ఎన్నో చిత్రాలకు సంబంధించి లోతైన అవగాహన ఉంది.
‘రవివర్మ పెద్ద మనవరాలైన మా అమ్మమ్మ... మహారాణి సేతు లక్ష్మీబాయి దగ్గర ఆయన గీసిన ఎన్నో చిత్రాలు ఉండేవి. వాటిని ఆమె తరువాత కాలంలో తన సంతానానికి పంచి పెట్టారు. తాజాగా వేలంలో సంచలనం సృష్టించిన చిత్రం వాటిలో లేదు. అయినప్పటికీ ఆ చిత్రం విశిష్టత గురించి చాలాసార్లు విని ఉన్నాను.
చూసేవారి దృష్టిని కట్టిపడేసే అయస్కాంత శక్తి ఆ చిత్రంలో ఉంది.
కళాత్మకంగా చెప్పాలంటే ఆయన అన్ని చిత్రాలలోనూ అద్భుతమైన కూర్పు, ఆకట్టుకునే రంగులు, కనువిందు చేసే దృశ్యాలు ఉంటాయి. ఒక మహిళ ఆవుపాలు పితుకుతుంటే, ఆమె బిడ్డ అక్కడే పాలకోసం ఎదురుచూడడం సాధారణ గ్రామీణ దృశ్యం. అయితే ఈ సాధారణ దృశ్యం నిష్ణాతుడైన చిత్రకారుడి చేతిలో అసాధారణ కళాఖండంగా మారింది. తన కుంచె శక్తితో సాధారణ దృశ్యాన్ని నేత్రపర్వం చేశారు రవివర్మ’ అంటున్నారు రుక్మిణి వర్మ. 2015లో స్థాపించబడిన ‘రాజా రవివర్మ హెరిటేజ్ ఫౌండేషన్’కు 84 ఏళ్ల రుక్మిణి వర్మ చైర్పర్సన్. ‘ఆధునిక కాల అవసరాల దృష్ట్యా తాతగారి కళాఖండాలను పరిరక్షించడం సవాలుగా మారింది’ అంటున్నారు రుక్మిణి. ఆమె కుమారుడు జయవర్మ తన కుటుంబ కళావారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు.
‘కళాకారుల కుటుంబాలు తమ వారసత్వ సంపదను బాధ్యతతో పరిరక్షించాలి. ఆధునిక కాలంలో వివిధ కారణాల వల్ల అది సులువైన విషయమేమీ కాదు. అందువల్ల కళాకారుడి పేరు, కృషిని తమ కోసమే కాకుండా ప్రపంచం కోసం కూడా కొనసాగించాలి’ అంటున్నారు రుక్మిణి.
కిలిమన్నూరులో జన్మించిన రాజా రవివర్మ మావేలిక్కర ట్రావెన్కోర్ రాజవంశానికి చెందిన భాగీరథి భాయిని వివాహం చేసుకున్నారు. ట్రావెన్కోర్ రాజకుటుంబం దక్షిణ కేరళను పాలించినప్పటికీ బెంగళూరు వరకు విస్తరించి ఉంది. ఈ రాజవంశ సభ్యులలో కొందరు బెంగళూరులో నివాసం ఏర్పర్చుకున్నారు. ఆస్తులు ఇక్కడే ఉన్నాయి. సంస్థానాల రద్దు తరువాత రాజప్రతినిధి అయిన సేతు లక్ష్మిబాయి బెంగళూరు నగరానికి తరలివచ్చారు. ఆమె కుటుంబం రిచ్మండ్ రోడ్లో స్థిరపడడంతో ఆ రాజవంశీయులలో కొంతమంది బెంగళూరువాసులుగా మారిపోయారు. ఈ రాజవంశ పరంపరకు చెందిన ‘రాజా రవివర్మ హెరిటేజ్ ఫౌండేషన్’ నగర నడిబొడ్డున ఉన్న లావెల్ రోడ్డులో ఉంది.


