
సరస్సులో పడవల సందడితో కనువిందు చేసే పండుగ ఇది. ఏటా శరదృతువులో పద్దెనిమిది రోజుల పాటు కొనసాగే ఈ పండుగ కోలాహలం చూసి తీరాల్సిందే! మయాన్మార్లోని ఇన్లే సరస్సు ఒడ్డున ఉన్న ‘ఫాంగ్ డా వూ’ పగోడా వరకు పద్దెనిమిది రోజుల పాటు పడవల ఊరేగింపు జరుగుతుంది.
మయాన్మార్ చాంద్రమాన కేలండర్లోని ఏడో నెల అయిన థాడింగ్యుట్ నెలలో శుక్లపక్షం మొదటి రోజు నుంచి బహుళపక్షం మూడో రోజు వరకు జరిగే ఈ పండుగలో లక్షలాది మంది జనాలు పాల్గొంటారు. ఈసారి ఈ పండుగ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమై, 20 వరకు జరుగుతోంది. మయాన్మార్లోని మైనారిటీ తెగలకు చెందిన ‘ఇంథా’, ‘పావో’ తెగలవారు ఈ పండుగలో పెద్దసంఖ్యలో పాల్గొంటారు. పండుగ జరిగే పద్దెనిమిది రోజుల్లోనూ ఇన్లే సరస్సులో పడవల మీద ఊరేగింపుగా వెళ్లి ‘ఫాంగ్ డా వూ’ పగోడాకు చేరుకుంటారు.
పగోడాలో బంగారుపూతతో కొలువుదీరిన ఐదు బుద్ధప్రతిమలను భక్తిగా తాకి, వాటికి బంగారు రేకులను అతికిస్తారు. విగ్రహాలు మరీ బరువుగా మారడం వల్ల పగోడా నిర్వాహకులు విగ్రహాలకు భక్తులు బంగారు రేకులను అతికే ప్రక్రియపై 2019 నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. ఈ విగ్రహాల వద్ద భక్తులు సామూహికంగా ప్రార్థనలు జరుపుతారు. ఇన్లే సరస్సు తీరంలోని గ్రామాల్లో ఈ పద్దెనిమిది రోజులూ పండుగ కోలాహలం అట్టహాసంగా కనిపిస్తుంది. పడవల ఊరేగింపు జరిగినన్ని రోజులూ హంస ఆకారంలో ఉన్న రాచపడవను అనుసరించి వందలాది పడవలు ‘ఫాంగ్ డా వూ’ పగోడా తీరం వరకు ప్రయాణిస్తాయి.
(చదవండి: అత్యంత అరుదైన వరుణదేవుడి ఆలయం..!)