పరాగ్‌... పడిలేచిన కెరటం | Parag Agrawal founded an artificial intelligence startup called Parallel Web Systems | Sakshi
Sakshi News home page

పరాగ్‌... పడిలేచిన కెరటం

May 2 2026 4:23 AM | Updated on May 2 2026 4:23 AM

Parag Agrawal founded an artificial intelligence startup called Parallel Web Systems

ముప్పై ఏడు సంవత్సరాల వయసులోనే ట్విటర్‌ సీయీవోగా ‘వావ్‌’ అనిపించుకున్నాడు పరాగ్‌ అగర్వాల్‌. ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను సొంతం చేసుకోవడంతో అవమానకర రీతిలో సంస్థ నుంచి బయటికి వచ్చిన తరువాత ‘అయ్యో!’ అనిపించుకున్నాడు. అయితే అగర్వాల్‌ ‘ఆహా’ ‘అయ్యో’లకు అతీతుడు. ‘ది బెస్ట్‌ రివెంజ్‌ ఈజ్‌ మాసివ్‌ సక్సెస్‌’ అని నమ్మినవాడు. తన ఏఐ స్టార్టప్‌ ‘ప్యారలల్‌ వెబ్‌ సిస్టమ్స్‌’తో మరోసారి ‘వావ్‌’ అనిపించుకున్నాడు పరాగ్‌ అగర్వాల్‌. 19 వేల కోట్ల కంపెనీగా ‘ప్యారలల్‌ వెబ్‌ సిస్టమ్స్‌’ను తీర్చిదిద్దాడు...

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ పరాగ్‌ అగర్వాల్‌ జన్మస్థలం. ముంబైలోని అటోమిక్‌ ఎనర్జీ జూనియర్‌ కాలేజీలో చదువుకునే రోజుల్లో తొలిసారిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నాడు. టర్కీలో జరిగిన  ‘ఇంటర్నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌’లో బంగారు పతకం గెలుచుకున్నాడు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ చేసిన అగర్వాల్‌ పీహెచ్‌డీ కోసం యూఎస్‌కు వెళ్లాడు. ట్విటర్‌లో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా చేరడానికి ముందు మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్, యాహూ రిసెర్చ్‌లలో ఇంటర్న్‌షిప్‌లు చేశాడు.

అతడి టైమ్‌ అలా మొదలైంది...
‘నా టైమ్‌ మొదలైంది’ అనుకునే టైమ్‌ అగర్వాల్‌కు 2017లో వచ్చింది. అగర్వాల్‌ను చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు ట్విటర్‌ ప్రకటించింది. లోప్రోఫైల్‌లో ఉండడం వల్ల కావచ్చు, అగర్వాల్‌ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. సీయీవోగా అతడి నియామకం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

ట్విటర్‌లో ఎన్నో వ్యూహాత్మక కార్యక్రమాలలో అగర్వాల్‌ కీలక పాత్ర పోషించిన విషయం చాలామందికి తెలియదు. అలాగని సీయీవోగా అగర్వాల్‌ నియామకం రాత్రికి రాత్రి జరగలేదు. 2021లో జాక్‌ డోర్సీ స్థానంలో ట్విటర్‌ సీయీవో పదవిలోకి వచ్చాడు అగర్వాల్‌. తగిన సీయీవో కోసం చాలా ప్రయత్నాలు చేసి విఫలమైన తరువాత ‘సీయీవో పోస్ట్‌కు అగర్వాల్‌ సరిౖయెనవాడు’ అని బోర్డ్‌ నిర్ణయించింది. ‘ట్విటర్‌ కంపెనీని, దాని అవసరాలను అగర్వాల్‌ ఎంతగా అర్థం చేసుకున్నారనేది మాటలకు అందనిది’ అని డోర్సి ట్వీట్‌ చేశాడు.

ఎన్నో అడ్డంకులు, ఎన్నో సవాళ్లు....
‘తక్కువమంది ఉద్యోగులు ఉన్న రోజుల్లో కంపెనీలో చేరాను. ఒడిదుడుకులను, సవాళ్లను, అడ్డంకులను ఎదుర్కొన్నాను. విజయాలు అందుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను అడుగడుగునా ట్విటర్‌ అద్బుత ప్రభావాన్ని, నిరంతర పురోగతిని చూశాను. ఇప్పుడు మన ముందు ఉన్న ఉత్తేజకరమైన అవకాశాలను చూస్తున్నాను’ అన్నాడు ట్విటర్‌ సీయీవోగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో అగర్వాల్‌.

బ్యాడ్‌ టైమ్‌ అలా మొదలైంది...
ట్విటర్‌ కంపెనీని ‘టెస్లా’ చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకోవడంతో అగర్వాల్‌ కెరీర్‌లో ట్విస్ట్‌ మొదలైంది. సీయీవో పదవి నుంచి అగర్వాల్‌ను తొలగిస్తారనే ఊహాగానాలు నిజం కావడానికి ఎంతో కాలం పట్టలేదు.
సీయీవో సీట్‌లో కూర్చున్న తొలిరోజు ఉద్యోగులను ఉద్దేశించి....
‘మన ముందు ఉన్న ఉత్తేజకరమైన అవకాశాలను చూస్తున్నాను’ అన్నాడు అగర్వాల్‌.
ఉత్తేజకరమైన అవకాశాలేమిటోగానీ, ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను సొంతం చేసుకున్న తరువాత అగర్వాల్‌తో పాటు, ఉద్యోగులకు అవమానాలు ఎదురయ్యాయి. ‘మన భవిష్యత్‌ ఏమిటి?’ అనే భయం మొదలైంది. కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను అవమానకర రీతిలో మస్క్‌ బయటికి పంపించినట్లు వార్తలు వచ్చాయి.

తిరుగులేని విజయం
‘అవమానకర రీతిలో అగర్వాల్‌కు ఉద్వాసన పలికారు’ అనే వార్త అగర్వాల్‌పై సానుభూతి కలిగించింది. ఆ సమయంలో అగర్వాల్‌ మానసిక పరిస్థితి ఏమిటో తెలియదు. తెలియకపోయినా ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు... ఎప్పుడూ అధైర్యపడి ఉండడు అని! 
‘మళ్లీ నన్ను నేను నిరూపించుకుంటాను’ అని గట్టిగా అనుకొని ఉంటాడు. 2023లో ‘ప్యారలల్‌ వెబ్‌సిస్టమ్స్‌’ అనే ఏఐ స్టార్టప్‌ను ్రపారంభించాడు. తిరుగులేని విజయాన్ని సాధించాడు. ఇప్పుడు ఈ కంపెనీ విలువ సుమారుగా 19 వేల కోట్లు!
 
ప్యారలల్‌లో...
ఏఐ ఏజెంట్ల కోసం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది పరాగ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని ప్యారలల్‌ వెబ్‌సిస్టమ్స్‌. లీగల్‌ రిసెర్చ్‌ నుంచి ఫైనాన్షియల్‌ ఎనాలసిస్‌ వరకు దేనినైనా నిర్వహించగలదు. ముందుగా శిక్షణ పొందిన డేటాపై ఆధారపడకుండా, లైవ్‌ వెబ్‌లో ఏఐ ఏజెంట్లు యాక్టివ్‌గా శోధించడానికి, సమాచారాన్ని సంగ్రహించడానికి(ఎక్స్‌ట్రాక్ట్‌), సంక్లిష్టమైన వర్క్‌ఫ్లోను ఎగ్జిక్యూట్‌ చేయడానికి అనుమతించే సాధనాలను ‘ప్యారలల్‌’ నిర్మిస్తోంది. లోతైన పరిశోధన నుంచి వర్క్‌ ఫ్లో ఆటోమేషన్‌ వరకు అన్నింటినీ కవర్‌ చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement