సుమధుర వనానికి రాజు సింహం. అది జీవులను కన్న బిడ్డల్లా చూసుకునేది. ఏ జంతువో, పక్షో ఆపదలో ఉంటే ఆదుకునేది. కాని, సరైన సమయంలో చేయకపోవటం దాని బలహీనత. ఈ తీరు మార్చుకోమని మంత్రి ఎలుగుబంటి సింహానికి సలహా ఇస్తుండేది. కాని, ఎలుగుబంటి సలహాను సింహం పట్టించుకునేది కాదు. ప్రతిఏటా సింహం పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతుండేవి. సింహం అభిమాని ఏనుగు పొరుగు అడవి నుంచి ఆ వేడుకలకు తప్పక వచ్చేది. ఎప్పటిలా ఆ ఏడాది కూడా సింహం పుట్టినరోజుకు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. పొరుగు అడవి నుంచి వేడుకలకు ఏనుగు బయలుదేరింది.
సుమధుర వనానికి చేరగానే ఒంటికి ఉన్న బురద, దుమ్ము, ధూళి శుభ్రం చేసుకోవాలని దారిలో కనిపించిన చెరువులోకి దిగి స్నానం చేసింది. ఆ చెరువులో ఒక చెడ్డ మొసలి ఉండేది. స్నానం చేసి తిరిగి వెళుతున్న ఏనుగుపై మొసలి కన్ను పడింది. అది ఏనుగు కాలిని నోటకరిచి నీటిలోకి గుంజింది. మొసలితో పోరాడిన ఏనుగు తప్పించుకుని, ఒడ్డుకు చేరుకుంది. రంపంలాంటి మొసలి దంతాలు గుచ్చుకుని, గాయమై రక్తం కారింది. కాలి నొప్పితో ముందుకు అడుగులు వేయలేకపోయింది. కుంటుకుంటూ కొద్ది దూరం నడిచి, ఒక మర్రిచెట్టు కింద కూర్చుంది. ఏనుగు పరిస్థితి గమనించిన దారిన పోయే జంతువులు వైద్యుడు కోతికి సమాచారం అందించాయి. కోతి వెంటనే మందుల సంచి భుజాన వేసుకొని, తన సహాయకుడైన మరో కోతితో ఏనుగు వద్దకు వెళ్లింది.
కాలి నుంచి కారుతున్న రక్తాన్ని శుభ్రం చేసి, పసరు మందు పూసి, కట్టు కట్టింది. ప్రతి ఏటా మృగరాజు సింహం పుట్టినరోజు వేడుకలకు వచ్చే ఏనుగు సుమధుర వనంలోని జంతువులు, పక్షులకు పరిచయమే!కాకి వచ్చి మృగరాజుకు ఏనుగు మర్రిచెట్టు కింద గాయంతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం అందించింది. సింహం స్పందించలేదు.విషయం తెలిసిన మంత్రి ఎలుగుబంటి, నక్క, ఒంటె వెంటనే ఏనుగు వద్దకు వెళ్లాయి. ఏనుగును పరామర్శించి వేడుకకు వెనుతిరిగాయి. ఏనుగు పరిస్థితిని సింహానికి వివరించింది ఎలుగుబంటి.సింహం మౌనంగా ఉండిపోయింది.సింహం మర్నాడు వెళ్లి ఏనుగును చూస్తుందని భావించింది ఎలుగుబంటి.రెండు రోజులు గడిచినా ఏనుగుని చూడటానికి సింహం కదల్లేదు.
సింహం వెళ్లి అభిమాని ఏనుగును పలకరించలేదని చెడుగా గుసగుసలు ప్రారంభించాయి అడవి జీవులు.ఆ సంగతి సింహం చెవిలో పడింది. మరునాడు ఉదయాన్నే సింహం ఒంటరిగా వెళ్లి, ఏనుగుని కలిసింది.‘‘మిత్రమా! ధైర్యంగా ఉండు. నీకు మేమున్నాం!’’ అంది సింహం.ఏనుగు తినటానికి అరటి గెలలు, చెరుకు గడలు తెప్పించింది.వైద్యుడు కోతిని దగ్గరికి తీసుకుని, ‘‘మిత్రమా! నీకు ఎలాంటి మూలికలు కావాలన్నా, సహకారం కావాలన్నా ఏర్పాటు చేస్తాను! ఏనుగుకు నాణ్యమైన చికిత్స అందించు’’ అంది సింహం. ‘‘రాజా! ఇప్పుడు ఏనుగు గాయం మానిపోయింది. రేపటి నుంచి మునపటిలా నడుస్తుంది!’’ అంది కోతి.ఆలస్యంగా ఏనుగు వద్దకు పోయినందుకు అప్పటికే సింహానికి చెడ్డపేరు రానే వచ్చింది.‘‘ప్రభూ! చేయాల్సిన పని అవసరం లేని సమయంలో చేస్తే, అది ఎంత గొప్ప పనైనా ఎవరినీ ఆకట్టుకోదు.
ఆ పనికి విలువ, గుర్తింపు కూడా ఉండదు. చేసిన పనికి ప్రయోజనం ఉండదు. కొన్నిసార్లు నష్టం కూడా జరగొచ్చు!’’ అంది ఎలుగుబంటి.గాయం మాని నడుస్తున్న ఏనుగును సింహం తన ఇంటికి తీసుకువెళ్లింది. ప్రేమతో గొప్ప విందు ఇచ్చింది. ఖరీదైన కానుకలిచ్చి తన పరివారంతో అడవి చివరి వరకు వెంటవెళ్లి సాగనంపింది. ఆభిమానిని ఆదరించిన సింహాన్ని మెచ్చుకున్నాయి అడవి జీవులు. ఈ పని ముందుగానే చేసుంటే తన విలువ మరింత పెరిగేదని తెలుసుకుంది సింహం.తన తప్పు దిద్దుకుంటూ, ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడే చేయడం మొదలుపెట్టింది. తీరు మార్చుకున్న సింహం త్వరలోనే గొప్ప రాజుగా పేరు తెచ్చుకుంది.


