అర్ధరాత్రి బిర్యానీని ఆర్డర్ చేసినట్టు, ఇకపై రాత్రి పన్నెండు గంటల సమయంలోనైనా సరే, ‘కాస్త ఎండను పంపండి బాబూ.. బట్టలు ఆరేసుకోవాలి’ అని మనం ఆర్డర్ పెట్టుకునే కాలం.. దాదాపుగా దగ్గరకు వచ్చేసినట్లే! ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ అనే ఒక అమెరికన్ స్టార్టప్ కంపెనీ, అంతరిక్షంలోకి ఏకంగా 50,000 అద్దాలను పంపి, ఎవరికి కావలిస్తే వారికి రాత్రి పూట కూడా భూమి మీదకు ఎండను డెలివరీ చేసేందుకు త్వరలోనే ఒక ప్రయోగాన్ని చేపట్టబోతోంది.
రిఫ్లెక్ట్ ఆర్బిటల్ ప్రయోగాత్మకంగా ఈ వేసవిలోనే సుమారు 60 అడుగుల (18.3 మీటర్లు) వెడల్పు ఉన్న ఒక మోడల్ అద్దాన్ని అంతరిక్షంలో అమర్చనుంది. అది భూమికి 640 కిలోమీటర్ల ఎత్తులో ఉండి, భూమి మీద ఉన్న సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలోని చీకటి ప్రదేశాన్ని వెలుగుతో నింపేస్తుంది. ఇందుకు అమెరికా ప్రభుత్వం కనుక అనుమతి ఇస్తే ఇకపై రాత్రిపూట వెన్నెలతో పాటు కృత్రిమ సూర్యకాంతి కూడా భూమికి అందుబాటులోకి వస్తుంది.
30 ఏళ్ల క్రితమే రష్యా ప్రయోగం!
నిజానికి ఇలాంటి ఆలోచన రావడం మానవ మేధావులకు ఇదే మొదటిసారి కాదు. 1993లో రష్యా వారు ‘జ్ఞామ్యా’ అనే ఒక ఉపగ్రహం ద్వారా 65 అడుగుల వ్యాసం కలిగలిన అద్దాన్ని అంతరిక్షంలో ఏర్పాటు చేసి, రెండు మూడు నిండు చంద్రుళ్లులు ఇచ్చేంత వెలుగును భూమి మీదకు పంపగలిగారు.
సైబీరియా వంటి మంచు ప్రాంతాల్లో పగలు తక్కువగా ఉంటుంది కాబట్టి, అక్కడ పగటి సమయాన్ని పెంచాలని అలా చేశారు. కానీ అది అప్పట్లో అంతగా ఫలించలేదు. ఇప్పుడు ఈ ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ కంపెనీ అదే ఆలోచనను భారీ ఎత్తున ముందుకు తీసుకెళుతోంది. అందుకోసం దాదాపు 28 మిలియన్ల డాలర్ల (సుమారు రూ. 235 కోట్లు) పెట్టుబడులు కూడా సమకూర్చుకుంది.
ఎండకు ‘సబ్స్క్రిప్షన్’
‘‘మేము శిలాజ ఇంధనాల (పెట్రోల్, బొగ్గు) స్థానంలో ప్రపంచం మొత్తానికి ఈ అద్దాల కాంతితో విద్యుత్తును ఇస్తాం చూడండి..’’ అని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాస్ బెన్ నోవాక్ ధీమాగా చెబుతున్నారు. ఆయన చెబుతున్న దానిని బట్టి 2027 నాటికి మరో రెండు మోడల్ అద్దాలు పైకి పంపిస్తారు. 2028 నాటికి ఏకంగా 1,000 పెద్ద సైజు అద్దాల ఉపగ్రహాలను ఆకాశంలోకి పంపాలని చూస్తున్నారు.
మొత్తం మీద ఆకాశంలో అద్దాలు అనే కొత్త నక్షత్రాలను మనం చూడబోతాం అన్నమాట. ఈ కంపెనీ ఉత్సాహం చూస్తుంటే భవిష్యత్తులో ఓటీటీ రీచార్జ్ లానే ఎండను కూడా చందా కట్టి కొనుక్కునే అవకాశం కల్పించేలా ఉంది. ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ కంపెనీ 2030 నాటికి 5,000 అద్దాలు, 2035 నాటికి ఏకంగా 50,000 అద్దాలను అంతరిక్షంలో పరచాలన్న కృత నిశ్చయంతో ఉంది.
రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ ప్రస్తుత అంచనాల ప్రకారం, రాత్రిపూట మనకు ఒక గంటసేపు సూర్యకాంతి కావాలంటే సుమారు 5,000 డాలర్లు (రూ. 4,62,000) చెల్లించాలి. అది కూడా కనీసం 1,000 గంటల ఒప్పందం చేసుకుంటేనే అంత తక్కువ ధర అట! ఇక, సోలార్ ప్లాంట్ యజమానులతో కూడా – ‘‘మేము రాత్రి పూట మీకు వెలుగు ఇస్తాం. దాని ద్వారా మీరు తయారు చేసే కరెంటు లాభాల్లో మాకు వాటా ఇవ్వండి’’ అని డీల్ కుదుర్చుకోబోతున్నారు.
‘పొద్దు కుదరని’ ప్రమాదం!
ఎన్ని ప్రయోజనాలున్నా, తక్కిన శాస్త్రవేత్తలు మాత్రం ఈ ప్రయోగాన్ని ‘సర్కాడియన్ రిథమ్’ (నిద్ర, మెలకువల లయ)పాలిట శాపంగా చూస్తున్నారు. మన శరీరంలో ఒక జీవ గడియారం ఉంటుంది. చీకటి పడగానే నిద్రపోవాలని, వెలుగు రాగానే లేవాలని అది చెప్తుంది. రాత్రి పూట అద్దాల వెలుగు వస్తే ఆ గడియారం దెబ్బతింటుంది. మన ఆరోగ్యాన్నీ దెబ్బ తీస్తుంది.
ఇది అక్కడితో ఆగదు. జంతువులు ఆహారం దొరకని సమయంలో పిల్లల్ని కనడం, శీతకాలంలో నిద్రావస్థలోకి వెళ్లే జంతువులు మధ్యలోనే మేల్కొనడం వంటి ప్రకృతి విరుద్ధమైన పరిణామాలు సంభవిస్తాయి. ఎక్కడెక్కడికో వలస వెళ్లే పక్షులు ఈ కృత్రిమ వెలుగును చూసి ‘వేసవి కాలం వచ్చేసింది’ అని పొరబడి, చలి తీవ్రంగా ఉన్న చోట్లకు వెళ్లి ప్రాణాలు వదిలే ప్రమాదం ఉంది.. తేనెటీగలకు, పూలకు ‘పొద్దు’ కుదరక, ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది.
పైలట్లు తికమక పడొచ్చు
మనుషుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఆకాశంలో హఠాత్తుగా మెరిసే ఈ అద్దాల వెలుగు విమాన పైలట్లను అయోమయానికి గురి చేయవచ్చు. టెలిస్కోపుల ద్వారా అంతరిక్షాన్ని పరిశోధించే శాస్త్రవేత్తలకు ఈ అద్దాలు పెద్ద అడ్డంకిగా మారవచ్చు. ఆరోగ్యం విషయానికొస్తే, రాత్రి పూట కూడా వెలుగు ఉంటే మన శరీరంలో నిద్రకు కారణమయ్యే హార్మోన్లు విడుదల కావు. ఫలితంగా ఇన్సోమ్నియా (నిద్రలేమి) వంటి రోగాలు దరి చేరవచ్చు. ఇవన్నీ అలా ఉంచి, ఈ ప్రయోగం వల్ల మొత్తంగా చీకటి మాయమైపోయే ప్రమాదం ఉందని ‘డార్క్ స్కై’ అనే సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఖగోళ శాస్త్రవేత్తల కలవరం!
ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటికే అంతరిక్షంలో తిరుగుతున్న ఉపగ్రహాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశంలో వేల సంఖ్యలో పరిభ్రమిస్తు్తన్న ఉపగ్రహాల వల్ల నక్షత్రాలను, గ్రహాలను సరిగ్గా చూడటం వారికి కష్టమవుతోంది. ఒక పక్క స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీలు తమ శాటిలైట్లు తక్కువ వెలుగును ప్రతిబింబించేలా (వీటిని డార్కర్ శాటిలైట్స్ అంటారు) ప్రయత్నిస్తుంటే, ఈ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ వాళ్లు మాత్రం తమ శాటిలైట్లను వీలైనంత ఎక్కువ మెరిసేలా అమర్చబోతున్నారు. మరోవైపు, టెలిస్కోపులతో తీసే అంతరిక్ష ఫోటోల్లో ఈ అద్దాల వెలుగు ఒక తెల్లటి గీతలా పడి, అసలైన నక్షత్రాల సమాచారాన్ని మింగేసే ప్రమాదం ఉందని కూడా శాస్త్రవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆకాశం నుండి కాంతి కాలుష్యం
ప్రిన్స్ టన్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ గ్యాస్పర్ బాకోస్ ఈ అద్దాల ఆలోచనపై నిప్పులు చెరుగుతున్నారు. రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీ వాళ్లు.. ‘‘మేము కేవలం ఒక చిన్న ప్రదేశంలోనే (సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణం) వెలుగు వచ్చేలా చూస్తాం, పక్కన ఉన్న టెలిస్కోపుల జోలికి వెళ్లము’’ అని నమ్మకంగా చెబుతున్నప్పటికీ, ‘‘ఆకాశం నుండి వచ్చే కృత్రిమ అద్దాల కాంతి.. వాతావరణంలోని మేఘాలు, గాలి కణాల వల్ల అటు ఇటు చెల్లాచెదురు అవుతుంది. దీనివల్ల ఆ ప్రాంతం చుట్టూ ఒక పెద్ద ‘లైట్ పొల్యూషన్’ ఏర్పడుతుంది.
ఇది ఖగోళ పరిశోధనలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది’’ అని ప్రొఫెసర్ గ్యాస్పర్ అంటున్నారు. ‘‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్ లాంటి కంపెనీలను అంతరిక్షంలో అద్దాలు పెట్టకుండా ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఇది మన పర్యావరణానికి చాలా రకాలుగా హాని కలిగిస్తుందని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. ఏమైనా, ఈ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ కంపెనీకి అమెరికా ప్రభుత్వం పచ్చ జెండా ఊపుతుందా, లేక శాస్త్రవేత్తల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ఉపయోగాలు అనేకం!
అంతరిక్షంలో అద్దాలు బిగించి, సూర్యకాంతిని భూమి పైన ఉన్న వారికి డెలివరీ చేయటం అనే ఈ ఐడియా వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా సన్నివేశంలా ఉన్నప్పటికీ, ఇది కనుక నిజంగా కార్యాచరణలోకి వస్తే, దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని రిఫ్లెక్ట్ ఆర్బిటర్ చెబుతోంది.
రాత్రి పూటాసౌర శక్తి ఉత్పత్తి
సోలార్ ప్యానెల్స్ రాత్రిపూట కరెంట్ తయారు చేయలేవన్నది తెలిసిందే. కానీ ఈ అద్దాలు ఉంటే, రాత్రి కూడా సూర్యకాంతిని ప్యానెల్స్ మీద వేసి 24 గంటలూ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. అంటే సోలాన్ విద్యుత్తును నిల్వ ఉంచే బ్యాటరీల అవసరం తగ్గుతుంది.
విపత్తు సమయాల్లో వెలుగు
భూకంపాలు, వరదలు, దుర్ఘటనలు రాత్రివేళ సంభవించినప్పుడు కరెంట్ పోయి అంతా చీకటిగా ఉంటుంది. అలాంటి సమయాల్లో గాలింపు చర్యల బృందాలకు ఆకాశం నుండే వెలుగు అందించి ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు.
వేగంగా ప్రాజెక్టు పనులు
మారుమూల ప్రాంతాల్లో మైనింగ్ లేదా నిర్మాణ పనులు జరిగేటప్పుడు, రాత్రి పూట కూడా పగలు మాదిరిగానే పని చేసుకోవడానికి ఈ అద్దాల వెలుగు ఉపయోగపడుతుంది. పని గంటలు పెరుగుతాయి, ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి.
సైన్యానికి బాసటగా..!
మిలిటరీ ఆపరేషన్లు జరిగేటప్పుడు నిరంతరాయంగా సోలార్ పవర్ అందించడానికి, చీకటిలో శత్రువుల కదలికలను కనిపెట్టడానికి ఈ అద్దాల వెలుగును వాడుకోవచ్చు.
వ్యవసాయానికీ పండగే
మొక్కల ఎదుగుదలకు సూర్యరశ్మి ముఖ్యం. కాబట్టి పంట కాలాల వ్యవధిని పెంచడానికి, మొక్కలకు కావాల్సినంత వెలుగును అందించి దిగుబడిని పెంచడానికి దర్పణకాంతిని వాడుకోవచ్చు.
నగర వీధులు కళకళ
రోడ్ల మీద వేల సంఖ్యలో స్ట్రీట్ లైట్లు పెట్టే బదులు, నేరుగా పై నుండే వెలుగును వాడుకోవచ్చు. అంతేకాదు, దీనివల్ల భూమి మీద ‘లైట్ పొల్యూషన్’ తగ్గుతుందని కూడా ఈ కంపెనీ అంటోంది.
కాంతులీనే వేడుకలు
పెద్ద పెద్ద ఈవెంట్లు, బహిరంగ కార్యక్రమాలు, పర్యాటక క్షేత్రాలలో రాత్రి పూట ఒక వింతైన అనుభూతిని కలిగించడానికి ఈ ఆర్టిఫిషియల్ సన్ లైట్ ను వాడుకోవచ్చు.
-సాక్షి స్పెషల్ డెస్క్


