
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 2024 కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా ఆ అయోధ్య రాముడి కోసం గుజరాత్ని వడోదరాలో తర్సాలీ గ్రామం తమ వంతుగా మర్చిపోలేని ఓ గొప్ప కానుక ఇవ్వాలనుకుంది. అందులో భాగంగా భారీ అగరబత్తి తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆ గ్రామ ప్రజలు. అంతేగాదు ఈ భారీ అగర్బత్తి కారణంగా ప్రతిరోజు రాముడికి ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందట. తొలుత ఈ భారీ అగరబత్తిని తయారు చేయాలని సంకల్పించింది విహాభాయ్ అనే రైతు. అయనకు రాముడంటే అమితమై భక్తి.
ఈ నేపథ్యంలోనే ఆయన 108 అడుగులు పోడవు ధూపం తయారు చేయాలని సంకల్పించారు. అందుకోసం 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్ మెటీరియల్, 1475 కిలోల ఆవు పేడ పొడి తదితరాలను వినియోగించినట్లు విహాభాయ్ తెలిపారు. ఇలా మొత్తంగా సుమారు 3,400 కిలోల బరువు ఉన్న అగరుబత్తిని సిద్ధం కానుంది. ఆయనకు ఈ అగరుబత్తిన తయారు చేయడంలో గ్రామస్తులు కూడా తమవంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు కావాల్సిన ముడి సరుకును, ఉపయోగించే పదార్థాలను సమకూర్చి ఆయనకు తగినంత సాయం అందించారు.
ఈ విధంగా అక్కడున్న వారంతా రాముడిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అంతేగాదు ఈ భారీ అగరుబత్తి తయారయ్యిన తదనంతరం డిసెంబర్ 2023 కల్లా భారీ ఊరేగింపుగా రామజన్మ భూమి అయోధ్యకు తరలిస్తామని ఆనందంగా చెబుతున్నారు విహాభాయ్. ఈ భారీ పంచద్రవ్య ధూపదీపం(అగర్బత్తి) తయారీ పనులు కూడా తుదిదశకు చేరుకున్నట్లు వెల్లడించారు విహాభాయ్.