ఏలూరు రూరల్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు జరగనున్నాయని డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఏలూరు జిల్లా అండర్–15 సబ్జూనియర్స్, అండర్–18 జూనియర్స్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9 గంటలకు జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ వద్ద చేపట్టనున్నామని వివరించారు. కాయకింగ్, రోయింగ్, డ్రాగన్బోట్ విభాగాల్లో క్రీడాకారులు పాల్గొనాలని పేర్కొన్నారు. ఆసక్తి గల బాలబాలికలు ముందుగా శాప్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు పీవీవీఎస్ కృష్ణమూర్తి, 83318 73037 నంబరులో సంప్రదించాలన్నారు.
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 289 వినతులు అందాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. ఎంజే అభిషేక్ గౌడ మాట్లాడుతూ ఫిర్యాదులను నిర్ధేశించిన సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ భాస్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పెదపాడు: జాతీయ రహదారిపై గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గుండుగొలను వైపు నుంచి విజయవాడ వైపు గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు పెదపాడు ఎస్సై, ఎకై ్సజ్ సీఐ ధనరాజ్ కలపర్రు టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆటోలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులు పిల్లా మోహనరావు, తాతపూడి జితేంద్ర, సబ్బవరపు సాయిబాబులను అరెస్ట్ చేశారు. ఎస్సై ఆర్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో క్లూయిజ్ టీమ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రామారావు డిమాండ్ చేశారు. బీటీఏ రాష్ట్ర శాఖ ఆదేశాను సారం దశలవారీ పోరాటాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 4గంటలకు స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీటీఏ ఏలూరు జిల్లాశాఖ ఆధ్వర్యాన ఉద్యోగ, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై కొద్ది సేపు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.
దెందులూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఎస్సై ఆర్ శివాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవరప్పాడు గ్రామానికి చెందిన తంగేళ్ల అప్పారావుకు, లత (20)కు ఏడు నెలల క్రితం వివాహమైంది. తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న అప్పారావు దంపతుల మధ్య గత కొన్నిరోజులుగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో మనస్పర్థల కారణంగా మనస్తాపానికి గురైన లత, భర్త అప్పారావు పనికి వెళ్లిన తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లత మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి మార్చురీకి తరలించారు.


