పరిష్కారం కాని సమస్య
అధ్వాన రోడ్లతో ప్రజలకు యాతన
నరసాపురం రూరల్: మొగల్తూరు మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకూ జఠిలమవుతోంది. ఒకవైపు గుంతలమయమైన రోడ్లు, మరోవైపు క్రమబద్ధీకరణ లేని వాహనాల రాకపోకలతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొగల్తూరు సెంటర్ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. మండలంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు సరైన మరమ్మతులు లేక గుంతల మయంగా మారాయి. బైపాస్ రోడ్డు నుంచి ఊర్లోకి వెళ్లాలంటే వాహనచోదకులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్ల దుస్థితి వల్ల వాహనాల వేగం తగ్గడం తద్వారా ట్రాఫిక్ స్తంభించి పోవడం నిత్యకృత్యమైంది. మార్కెట్లో వ్యాపార సముదాయాలు ఉండటంతో సెంటర్ సాయంత్ర సమయంలో ప్రజలతో రద్దీగా ఉంటుంది. పార్కింగ్కు సరైన స్థలం లేకపోవడం, రోడ్డు పక్కనే వాహనాలు నిలిపివేయడంతో రహదారులు ఇరుకుగా మారుతున్నాయి. ఇటీవల అధిక లోడుతో వస్తున్న ఒక లారీ విద్యుత్ తీగలను తాకడంతో స్తంభం నేలకూలింది. ప్రాణనష్టం జరగక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
పర్యవేక్షణ కరువు
ట్రాఫిక్ నియంత్రణ చర్యలు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు, క్రమబద్దీకరణ చేసే సిబ్బంది లేకపోవడంతో గంటల తరబడి వాహనాలు నిలిపోతున్నాయి. మొగల్తూరు సెంటర్లోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని, తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయించి ప్రమాదాలు జరుగకుండా చూడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
మొగల్తూరు పాతకాలువ సెంటర్ ప్రాంతం నుంచి లాకు వరకు రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.
– యడ్ల చిట్టిబాబు, సీపీఎం నేత


